లాక్ డౌన్ అనివార్యమే కానీ మోడీ సర్కార్ కు ప్లానింగ్ లేదు : సోనియా గాంధీ చురకలు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పలు సూచనలు చేశారు . అదే సమయంలో కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా సోనియా గాంధీ లాక్ డౌన్ పరిస్థితిపైనా, కరోనా వైరస్ వ్యాప్తిపైనా చర్చించారు . మానవాళి సంక్షోభంలో వున్న సమయంలో ఇలా కలుస్తున్నందుకు బాధగా వుందంటూ మాట్లాడిన సోనియాగాంధీ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాలు చాలా పెద్దదని, అయినా దాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
Recommended Video
కరోనా ఎఫెక్ట్ ... ఆ తిండి విషయంలో చైనా సంచలన నిర్ణయం
కరోనాపై యుద్ధంలో లాక్ డౌన్ తో పేదలు ఇబ్బంది పడుతున్నారని , దేశంలో పేదలు, దినసరి కూలీలకు ప్రస్తుతం పెను ప్రమాదం పొంచి వుందని, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలను యుద్దప్రాతిపదికన తీసుకోవాల్సి వుందని సోనియా గాంధీ కేంద్రానికి సూచించారు. ఇక నిత్య వైద్య పరీక్షలు చేయడం తప్ప కరోనా వ్యాప్తిని అరికట్టటానికి మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు సోనియా గాంధీ .యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. వైద్యులు, మెడికల్ సిబ్బందికి రక్షణ చాలా అవసరమని, వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఎన్-95 మాస్కులు అందజేయాల్సి వుందని అన్న సోనియాగాంధీ ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు .
21 రోజుల లాక్ డౌన్ అత్యంత అనివార్యం అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి తగిన ప్రణాళిక లేకపోవడంతో వలస కుటుంబాలు, కూలీలు ఇబ్బందుల పాలవుతున్నారని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు . చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడడంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, పారిశ్రామిక వేత్తలకు తగిన ప్యాకేజీ అవసరమని సోనియా అభిప్రాయపడ్డారు . ఆ దిశగా సమగ్ర ప్రణాళికతో భవిష్యత్ కోసం కేంద్రం సిద్దం కావాల్సి వుందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, ఐసొలేషన్ వార్డుల వివరాలు, క్వారెంటైన్ ఏర్పాట్లు వంటి అంశాలను కామన్ పీపుల్కు అందుబాటులో వుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సోనియా గాంధీ. ఇక ఇదే సమయంలో భవిష్యత్ ఆలోచన కూడా చెయ్యాలన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరతను రాకుండా చర్యలు చేపట్టాలని, అందుకు రైతులకు తగిన చేయూతను అందించాలని ఆమె కేంద్రానికి సూచించారు.