Lockdown: ఆరోగ్య మంత్రికి భారీ స్వాగతం, మనోడే, కరోనాకు హాలిడే, జజ్జనక జనారే జనకుజన జనారే !
బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసినా కరోనా కంట్రోల్ కాకపోవడంతో ప్రస్తుతం లాక్ డౌన్ 5.0 అమలులో ఉంది. ఐదు సార్లు లాక్ డౌన్ అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని, ఆ పూర్తి భాద్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని సూచించింది. అయితే కరోనా మనోడి శాఖ కిందకే వస్తుంది, మనకేం భయం లేదు అనుకున్నారో ఏమో తెలీదు కాని ఆరోగ్య శాఖా మంత్రి పర్యటన సందర్బంగా వేలాది మంది ప్రజలు గుమికూడి మంత్రిగారికి భారీ ఎత్తున స్వాగతం పలికారు. జజ్జనక జనారే జనకుజన జనారే అంటూ ఊరేగింపుగా మంత్రిగారిని తీసుకెళ్లి పై నుంచి పూల వర్షం కురిపించారు. ఇదే సమయంలో కరోనాను లెక్క చెయ్యకుండా ఆపిల్ కాయలతో తయారు చేయించిన భారీ గజమాలను ఆరోగ్య శాఖా మంత్రికి వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఆరోగ్య శాఖా మంత్రి వచ్చారు, కరోనాకు సెలవు అనుకున్నారో ఏమో పిచ్చి ప్రజలు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !
కరోనా దెబ్బకు హడల్
కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్యాశాఖా మంత్రి, హోమ్ మంత్రి కరోనా భయంతో ఒకసారి హోమ్ క్వారంటైన్ లో కాలం గడిపారు. కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగించాలని, ఆ దిశగా తాము శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పదేపదే చెబుతున్నారు.
ఆరోగ్య శాఖా మంత్రి టూర్
కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి, చిత్రదుర్గ ఇన్ చార్జ్ మంత్రి బళ్లారి శ్రీరాములు మంగళవారం చిత్రదుర్గ జిల్లాలోని చళ్ళకెరెలోని హేమావతి నదికి పసుపు, కుంకుమతో పాటు సారె సమర్పించడానికి వెళ్లారు. ఆ సమయంలో మంత్రి బళ్లారి శ్రీరాములు చిత్రదుర్గ జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన అనుచరులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.
జజ్జనక జనారే జనకుజన జనారే
చిత్రదుర్గ జిల్లాలోని చళ్ళకెరె తాలుకా పరుశురాం పుర గ్రామంలో ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు కాలుపెట్టారు. అంతే బళ్లారి శ్రీరాములు ఎంట్రీతో ఆ ప్రాంతం జజ్జనక జనారే జనకుజన జనారే అంటూ డప్పులతో మార్మోగిపోయింది. వేలాది మంది మంత్రి బళ్లారి శ్రీరాములకు భారీ స్వాగతం పలికారు. ఎద్దుల బండిలో మంత్రి బళ్లారి శ్రీరాములను ఎక్కించి అక్కడి నుంచి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి మిద్దెల పైనుంచి పూల వర్షం కురిపించారు.
ఆరోగ్య శాఖ మనోడిదే, కరోనా ఏం చేస్తుంది ?
ఆరోగ్య శాఖా మంత్రి మనోడే, కరోనా మన మంత్రిగారి పరిదిలోనే ఉంటుంది, పైగా ఆయన మన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, కరోనా మనల్ని ఏం చేస్తుందిలే అంటూ స్థానికులు అనుకున్నారో ఏమో తెలీదు కాని బళ్లారి శ్రీరాములు పర్యటన సందర్బంగా ఆ ఊరిలో పండగ చేసుకున్నారు. ఆపిల్ కాయలతో భారీ గజమాల చేయించిన స్థానికులు వాటిని మంత్రికి వేసి స్వామి భక్తిని చాటుకున్నారు.
పోలీసులకు సినిమా
కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పరుశురాంపుర గ్రామస్తులు లాక్ డౌన్ నియమాలు పక్కనపెట్టి వేలాది మంది గుమికూడి మంత్రి బళ్లారి శ్రీరాములకు భారీగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. వేలాది మంది ఒక్కసారిగా గుమికూడటంతో అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం వారిని ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేశారు. భాద్యత కలిగిన పదవిలో ఉంటూ, అదికాకుండా ఆరోగ్య శాఖ మంత్రి అయిన బళ్లారి శ్రీరాములు సైతం ఇలా గుమికూడటం తప్పు అని స్థానికులకు నచ్చచెప్పకుండా ఊరేగింపులో పాల్గొన్నారని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి.