Lockdown: ఎస్ఐ, రౌడీషీటర్లు మందు పార్టీ, ముద్దులతో ఫోటోలు, వీడియోలు, కరోనా కాలంలో పోయేకాలం !
బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ప్రాణాలను లెక్క చెయ్యకుండా దేశం మొత్తం వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కరోనా కట్టడి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధులను పక్కన పెట్టిన సబ్ ఇన్స్ పెక్టర్ (SI) లిక్కర్ బ్యాన్ చేసిన సమయంలో తన పలుకుబడి ఉపయోగించి మద్యం తెప్పించాడు. రౌడీషీటర్లతో కలిసి పీకలదాక మద్యం సేవించిన ఎస్ఐ తరువాత ఒకరి మూతులు ఒకరు నాక్కుంటూ, ముద్దులు పెట్టుకుంటు వీడియోలకు, ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. లాక్ డౌన్ విధులు పక్కన పెట్టాడని, అధికారం దుర్వినియోగం చేశాడని, అక్రమంగా మద్యం సరఫరా చేయించాడని, సంఘవ్యతిరేక శక్తులతో కలిసి తిరుగతున్నాడని వెలుగు చూడటంతో ఎస్ఐ ఉద్యోగం ఊడిపోయింది.
Lockdown: బీరు బాటిల్ చూడగానే కళ్లు తిరిగిపడిపోయిన యువతి, మాతల్లే, ఎంత త్యాగం చేశావ్ ? గ్రేట్!
అసలే సరిహద్దు ప్రాంతం
కర్ణాటకలోని మైసూరు జిల్లా హిరియపట్టణ తాలుకాలోని బెట్టదపుర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ గా లోకేష్ ఉద్యోగం చేస్తున్నాడు. బెట్టదపుర పోలీస్ స్టేషన్ లో విధుల్లో చేరిన రోజు నుంచి లోకేష్ స్థానిక ప్రజలు, అమాయకుల మీద పెత్తనం చెలాయించడం మొదలు పెట్టాడు. అసలే తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు ఉండటంతో ఎస్ఐ లోకేష్ ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైయ్యింది.
దేశం మొత్తం లాక్ డౌన్, ఎస్ఐ మందు పార్టీ
కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కేవలం నిత్యవసర వస్తువులు, పాలు, కూరగాయలు విక్రయించే షాపులు మాత్రమే ఉదయం పూట రెండు మూడు గంటలు మాత్రమే తియ్యడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇక వైన్ షాప్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ లు మార్చి 24వ తేదీ నుంచి పూర్తిగా మూసివేశారు. లిక్కర్ బ్యాన్ చేసిన సమయంలో ఎస్ఐ లోకేష్ రౌడీషీటర్లతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు.
ఎస్ఐ కొంప ముంచిన అన్నయ్య
ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 8 గంటలకు ఎస్ఐ లోకేష్ మైసూరుకు చెందిన రౌడీషీటర్లు కలిసి బెట్టదపురలో మందు పార్టీ చేసుకున్నారు. రాత్రి 8 గంటలకు మొదలైన మందు పార్టీ అర్దరాత్రి దాటిపోయి వేకువ జామున 3 గంటల వరకు జరిగింది. ఆ సమయంలో సుమారు 8 గంటల పాటు మందు పార్టీలో జల్సా చేసిన ఎస్ఐ లోకేష్ రౌడీషీటర్లతో కలిసి డ్యాన్స్ లు వేస్తూ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశాడు. ఎస్ఐ లోకేష్, రౌడీషీటర్లు మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో అన్నయ్య అనే వ్యక్తి వీడియోలు, ఫోటోలు తీశాడు.
డీజీపీకి వీడియోలు పంపిస్తే ?
ఎస్ఐ లోకేష్, రౌడీషీటర్లు కలిసి మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు అన్నయ్య చేతికి వచ్చాయి. కరోనా వైరస్ కట్టడి కోసం సమాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచించిన ఆదేశాలను ఎస్ఐ లోకేష్ మందు పార్టీ సమయంలో మరిచిపోయాడు. రౌడీషీటర్లతో కలిసి ఎస్ఐ లోకేష్ మూతిమూతి నాకించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటు ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. ఎస్ఐ లోకేష్, రౌడీషీటర్ల మందు పార్టీ వీడియోలు, ఫోటోలను అన్నయ్య అనే వ్యక్తి కర్ణాటక డీజీపీ, ఐజీపీ, మైసూరు జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐ ఇలా అందరికి పంపించాడు.
నువ్వు పనికిరావు వెళ్లిపో !
ఎస్ఐ లోకేష్ తీరుపై పోలీసు అధికారులు మండిపడ్డారు. లాక్ డౌన్ లో నీకు లిక్కర్ ఎక్కడిది ? ఎవరు మందు సరఫరా చేశారు?, రౌడీషీటర్లతో నీకు స్నేహమా ? నువ్వు ఈ పోలీసు ఉద్యోగానికి పనికిరావు వెళ్లిపో అంటూ ఎస్ఐ లోకేష్ ను సస్పెండ్ చేశారు. ఈ విషయంపై డీఎస్పీ సుందర్ రాజ్ ఒన్ ఇండియా కన్నడతో మాట్లాడుతూ ఎస్ఐ లోకేష్, రౌడీషీటర్లు కలిసి మందు పార్టీ చేసుకున్నట్లు వీడియోలు, పక్కా సాక్షాలు చిక్కాయని అన్నారు.
పరువు పోయింది
మైసూరు జిల్లా ఎస్పీ సిబి. రిశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఎస్ఐ లోకేష్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని అన్నారు. మొత్తం మీద లాక్ డౌన్ డ్యూటీని పక్కన పెట్టిన ఎస్ఐ లోకేష్ రౌడీషీటర్లతో కలిసి మందు పార్టీ చేసుకుని చిందులు వెయ్యడంతో ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా పరువు పోగొట్టుకున్నాడని, మా పరువు తీశాడని సాటి పోలీసులు అంటున్నారు.