Lockdown: ఆంధ్రా తాగుబోతుల దెబ్బ, మంత్రి, ఎమ్మెల్యే డిష్యుం డిష్యుం, వైన్ షాప్ లు బంద్, దెబ్బకు !
బెంగళూరు/ బళ్లారి/ కర్నూలు: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో మందుబాబుల గొంతు ఎండిపోయింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాపులు తెరుచుకోవడంతో తాగుబోతులు హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తియ్యడంతో తాగుబోతులు పోలో అంటూ వైన్ షాపుల ముందు క్యూకట్టారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు 75 శాతం పెరిగిపోవడంతో మందుబాబులు షాక్ కు గురైనారు. ఇక చేసేది లేక ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు చెందిన తాగుబోతులు పక్కరాష్ట్రాలకు వెళ్లి మందు తాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మందుబాబులు కర్ణాటకలోకి విచ్చలవిడిగా వెళ్లి వస్తున్న సమమంలో ఆ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే నువ్వానేనా అంటూ గొడవలకు తగులుకున్నారు. ఈ దెబ్బతో ఆంధ్రా- కర్ణాటక సరిహద్దులోని మద్యం షాపులు పూర్తిగా మూసివేశారు.
Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !
తాగుబోతులకు 90 ML సినిమా
లాక్ డౌన్ సడలింపుల తరువాత ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు 75 శాతం పెరిగిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో మందుబాబులకు బ్రాందీ చుక్క నోట్లో పడక అల్లాడిపోయారు. అసలే పనీపాట లేకపోవడం, ఆదాయం లేకపోవడంతో తాగుబోతులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. లాక్ డౌన్ సడలింపులతో వైన్ షాపులు తీసినా మద్యం ధరలు 75 శాతం పెరిగిపోవడంతో మందుబాబులు షాక్ కు గురై వారికి 90 ML సినిమా కనపడింది.
ఆంధ్రా- కర్ణాటక బార్డర్ కు పరుగో పరుగు
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు 75 శాతం పెరిగిపోవడంతో మందుబాబులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైయ్యింది. కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోని గ్రామాలు, చిన్నచిన్న పట్టణాలకు వెళ్లి మందు తాగాలని మందుబాబులు నిర్ణయించారు. ఇక ఆలస్యం ఎందుకని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్ణాటకలో ఉన్న గ్రామాలు, చిన్నచిన్న పట్టణాల వైపు పరుగు తీశారు.
కర్నూలు, అనంతపురం కరోనా దెబ్బ
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో చాలా మంది చనిపోతున్నారని ఆ రెండు జిల్లాల సరిహద్దులోని బళ్లారి జిల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో 584 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు 16 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో 115 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో నలుగురు మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు మందు తాగడానికి కర్ణాటకలోని గ్రామాల వైపు వెలుతున్న సమయంలో స్థానిక ప్రజలు ఎక్కడ మాకు కరోనా వైరస్ వస్తుందో ? అనే భయంతో హడలిపోయి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు.
మంత్రి, ఎమ్మెల్యే డిష్యుం ఢిష్యుం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు మందు తాగడానికి కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోని గ్రామాలకు వస్తున్న విషయంపై కర్ణాటక మంత్రి, బళ్లారి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆనంద్ సింగ్, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే నాగేంద్ర మద్య గొడవలు మొదలైనాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తాగుబోతులు బళ్లారి జిల్లాలోకి వస్తుంటే మీరేం చేస్తున్నారు ? అంటే మీరేం చేస్తున్నారు ? అంటూ మంత్రి ఆనంద్ సింగ్, ఎమ్మెల్యే నాగేంద్రల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఆనంద్ సింగ్, నాగేంద్ర ఓ రిసార్ట్ లో ఒకరిమీద ఒకరు చెయ్యి చేసుకోవడంతో కేసులు నమోదై కోర్టుల చుట్టు తిరుగుతున్నారు.
తాగుబోతులతో మీ కర్మ కాలిపోతుంది
ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోకి ప్రవేశించకుండా చెక్ పోస్టుల దగ్గర పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక రహదారుల మీద మాత్రమే చెక్ పోస్టులు ఉండటంతో మందుబాబులు అడ్డదారుల్లో కొండలు, గుట్టలు, పరిసర ప్రాంతాల గ్రామాలు దాటుకుంటు కర్ణాటకలోని వైన్ షాపుల దగ్గరకు చేరుకుని ఫుల్ గా మద్యం సేవించి సాయంత్రం వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తాగుబోతులకు సహాయం చేస్తే మీ కర్మ కాలిపోతుందని అధికారులు స్థానిక గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు.
Recommended Video
ఆంధ్రా తాగుబోతుల దెబ్బకు క్లోజ్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఎక్కువ మంది తాగుబోతులు కర్ణాటకలోని వైన్ షాప్ లకు వచ్చి వెలుతున్న సమయంలో అధికారులు హడలిపోయారు. ఇదే విషయంపై మంత్రి ఆనంద్ సింగ్, ఎమ్మెల్యే నాగేంద్రల మద్య గొడవలు జరగడంతో బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లా తాగుబోతులకు కళ్లెం వెయ్యడానికి బళ్లారి సరిహద్దులోని ఐదు కిలోమీటర్ల పరిదిలో ఉన్న అన్ని వైన్ షాపులు మూసివెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా బళ్లారి జిల్లా సరిహద్దులోని అన్ని వైన్ షాపులు మూసి వెయ్యడంతో ఆంధ్రా తాగుబోతులు మందు చిక్కక తిరిగి తిరిగి నీరసం వెనక్కి వెళ్లిపోతున్నారు.