లాక్ డౌన్-సడలింపులు-లాక్ డౌన్- కేంద్రానికి ఈ దోబూచులాట తప్పదా ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 4200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా వైరస్ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాతో పోరాడుతూనే కాలం గడపాల్సిన పరిస్దితులు ఉన్నాయని కేంద్రం చెప్పకనే చెబుతోంది. లాక్ డౌన్ ఒక్కటే అన్నింటికీ మందు కాదని, గతంలో ఎన్నో వైరస్ లతో పోరాడిన భారతీయులు మరోసారి తమ రోగనిరోధకతను పరీక్షించుకోక తప్పదనే సంకేతాలు ఇస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా కరోనా .. సరిహద్దుల్లో నో ఎంట్రీ .. నిబంధనలు కఠినతరం
పెరుగుతున్న కేసులు.. తగ్గిన మరణాలు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 67వేల పైచికులుగా ఉంది. అయితే మరణాలు మాత్రం 2200 వద్దే ఉన్నాయి. అంటే వైరస్ తో పోరాటంలో భారత్ పరిస్ధితి మెరుగ్గానే ఉందని అర్ధమవుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నా, కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 44వేలు మాత్రమే. అంటే దాదాపు 23 వేల మంది కోలుకున్నారన్నమాట. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇదే ఇప్పుడు కేంద్రానికి ఊరటనిస్తోంది.
లాక్ డౌన్ సడలింపులే మేలు...
దేశవ్యాప్తంగా కరోనా పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్రం.. తాజా గణాంకాల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోంది. రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధ్యమైనన్ని ఎక్కువ మినహాయింపులు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రైలు, బస్సు, విమాన ప్రయాణాలకు ఒక్కొక్కటిగా అనుమతులు ఇవ్వడం, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ తెరుస్తామన్న సంకేతాలు ఇవ్వడం అంతా ఇందులో భాగమే. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే భయంభయంగా ఉండిపోతున్న జనానికి వైరస్ తో దీర్ధకాలిక పోరు చేయక తప్పదన్న సంకేతాలు ఇవ్వడం కోసమే ఇదంతా అన్నది ప్రభుత్వ ఉద్దేశం.
కేసులు పెరిగితే మళ్లీ లాక్ డౌన్...
దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ మినహాయింపులు ఇస్తున్నారంటే దానర్ధం కేసులు తగ్గిపోయాయని కాదు. కేసులు తగ్గిన చోట, అసలు లేని చోట మినహాయింపులు ఇవ్వడం ద్వారా అక్కడి ప్రజలను లాక్ డౌన్ నుంచి బయట పడేయడమే. ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందో ఇప్పుడే చెప్పలేం . లాక్ డౌన్ సడలింపుల ద్వారా జర్మనీ వంటి దేశాల్లో కేసులు పెరిగినట్లు నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సడలింపులు ఇచ్చిన చోట కేసులు పెరిగితే తిరిగి అక్కడ లాక్ డౌన్ విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
Recommended Video
దోబూచులాటే గతి అవుతుందా ?
ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి సడలింపులు ఇవ్వడం, తిరిగి అక్కడ కేసులు పెరిగితే మళ్లీ లాక్ డౌన్ విధించడం, రెడ్ జోన్లలో మాత్రం యథావిధిగా లాక్ డౌన్ కొనసాగించడం... ఇప్పుడు కేంద్రం ముందున్న ఏకైక ఆప్షన్ ఇదే. దీంతో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంటూ రెడ్ జోన్లను తగ్గించుకునేలా ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. లాక్ డౌన్ సడలింపు ఇచ్చారన్న సాకుతో విచ్చలవిడిగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమైతే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తిరిగి రెడ్ జోన్ గా ప్రకటించడమే ఇప్పుడు కేంద్రం ముందున్న మార్గం. దీనికి దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలతో పాటు నిపుణులు, సాధారణ ప్రజల నుంచి కూడా మంచి స్పందనే లభిస్తోంది.