లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన.. కానీ 1.7 కోట్ల మంది..!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నియామకాలు ఏప్రిల్ నుంచి రికార్డు స్థాయిలో జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 22శాతం మంది దరఖాస్తుదారులకు జూలై 7వరకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అనే సంస్థ ఉపాధి హామీ పథకం కింద ఎంతమందికి ఉద్యోగాలు లేదా పనులను ప్రభుత్వం కల్పించిందో ఒక బృందంతో సర్వే చేయించి పలు విషయాలను వెల్లడించింది. కరోనావైరస్ కారణంగా ఉపాధి హామీ పథకంకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ కారణంగా నగరాలు పట్టణాల్లో అన్నీ బంద్ కాగా వివిధ సంస్థల్లో పనిచేసే చాలామంది వలస కార్మికులు పనులు లేక సొంత గ్రామాలకు వెళ్లారు.
1.7 కోట్ల మందికి దక్కని ఉపాధి
ఇక ఉపాధి పథకం కింద ఉద్యోగాలు లభించని 22శాతం మంది అంటే 1.7 కోట్ల మంది ఉన్నారు. అయితే ఏప్రిల్ నెలలో ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని ఒక్క ఉద్యోగం కూడా పొందని దరఖాస్తుదారుల్లో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన వారే ఉన్నారు. అక్కడ 30శాతం మంది దరఖాస్తుదారులకు ఉద్యోగం లభించలేదు. రెండో స్థానంలో 24శాతంతో బీహార్ రాష్ట్రం ఉంది. ఇదిలా ఉంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత మూడునెలల్లోనే ఎన్నడూ లేనంతగా ఎంప్లాయిమెంట్ క్రియేట్ అయ్యింది.2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే 7.62 కోట్ల కుటుంబాలకు ఉపాధి లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో ఉపాధి లభించడం ఇదే తొలిసారి.
రాష్ట్రాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం
ఇక 2020-21 తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ లేదా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని సర్వే సంస్థ వెల్లడించింది. ఆయా రాష్ట్ర కార్మికుల సంఖ్యను బట్టి ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నిధులకు సాధారణంగా డిసెంబర్ నెలలో ఆమోదం లభిస్తుంది. అయితే ఊహించని రీతిలో కరోనావైరస్ రావడం దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో రాష్ట్ర ఖజానా పై ఈ భారం పడిందని సామాజిక కార్యకర్త , ఉపాధి హామీ పథకంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నిఖిల్ డే తెలిపారు.
పలు అంశాలపై సర్వే
ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామీణప్రాంతంలో నివాసం ఉండేవారికి 100 రోజుల పాటు పనికల్పించడం జరుగుతుంది. రోజుకు సగటున రూ.200 ఇందుకు ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ఈ వేతనాలను చెల్లిస్తోంది. ఇక ఉపాధి హామీ పథకం గత మూడు నెలల ప్రదర్శన, 100 రోజుల పాటు ఉపాధి, 100 రోజుల పని పూర్తి అవుతున్న వారి వివరాలు, ఆయా రాష్ట్ర ఖజానాల్లో మిగిలిన నిధులు, పని డిమాండ్ మేరకు ఎంప్లాయిమెంట్ ఉందా అనే అంశాలపై సర్వే చేసింది. అయితే బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి దొరకని దరఖాస్తుదారులు చాలామంది ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాల్లో నిధులు మాత్రం లేవని సర్వే తేల్చింది. ఇందుకు రెండు కారణాలు ఉండొచ్చని పేర్కొంది. స్థానిక అధికారులు దరఖాస్తులు స్వీకరించడం మానేసి ఉండాలి లేదా వేతనాల్లో జాప్యం అయిన జరుగుతుండాలి అని వెల్లడించింది.