లాక్డౌన్ ఘోరం: ఆకలితో ముగ్గురు మృతి.. కడుపుమంటతో హింసకు దిగుతోన్న వలస కూలీలు..
అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్నారు. ఊహించినట్లుగానే లాక్ డౌన్ ఆకలి కాటుకు మొదట బలైనవాళ్లు.. మారుమూల గ్రామాల్లోని దళితగిరిజనులే. అందరికీ ఆహారం అందిస్తామన్న ప్రభుత్వాల హామీలు.. చాలా చోట్ల ఫైళ్లకే పరిమితమైపోయాయి. ఎప్పటిలాగే, అవి ఆకలి చావులు కానేకావని నిరూపించేందుకు ప్రభుత్వాధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాలు వెలువడటంతో చాలా చోట్ల వలస కూలీల్లో తిరుగుబాటు మొదలైంది. వాళ్లలో కొందరు హింసకు దిగడం కలవరపాటుకు గురిచేస్తున్నది..
కరోనా దారుణం: హైదరాబాద్ రోడ్డుపై శవం.. జేబులో వైరస్ టెస్టుల స్లిప్పు.. సిటీలో షాకింగ్ ఘటన
మళ్లీ అక్కడే..
ఇండియాలోని మొత్తం ఖనిజ సంపదలో 45 శాతం తనలోనే దాచుకున్నా జార్ఖండ్ ఇప్పటికీ పేదరాష్ట్రంగానే కొనసాగుతున్నది. మామూలు రోజుల్లోనే అక్కడ ఆకలి కేకలు వినబడుతుంటాయి. లాక్ డౌన్ కారణంగా అవి చావుకేకలుగా మారుతున్నాయి. ఆదివారంతో కరోనా లాక్ డౌన్ 19వ రోజుకు చేరింది. గత మూడు వారాల్లో జార్ఖండ్ లో మొత్తం మూడు ఆకలిచావులు రిపోర్ట్ అయ్యాయి. వందల మంది పేదలు ఆకలితో అలమటిస్తున్న ఉదంతాలు బయటికొచ్చాయి. గార్వా, బొకారో, రాంగఢ్ జిల్లాల్లో ఈ సంఘటనలను జరిగినట్లు జాతీయ మీడియా, స్వచ్ఛంద కార్యాకర్తల ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే వలసకూలీలు హింసకు పాల్పడిన ఘటనలు మాత్రం ఢిల్లీ, సూరత్ లో చోటుచేసుకున్నాయి.
అందరివీ దీనగాథలే..
గార్వా జిల్లా భండారియా గ్రామంలో సోమారియా దేవి(72)అనే వృద్ధురాలు భర్త లచ్చూ లోహ్రాతో కలిసుండేది. వాళ్లకు పిల్లలు లేరు. రేషన్, పెన్షన్ అసలే అందేవికావు. పక్కూళ్లో నివసించే సమీప బంధువొకరు.. వారానికోసారి సరుకులు ఇచ్చేళ్లేవాడు. లాక్ డౌన్ తో అదీ బంద్ అయింది. ఏమీ తినకుండా తొమ్మిది రోజుల తర్వాత సోమారియా దేవి కన్నుమూసింది. ఆ తర్వాతగానీ అధికారులు స్పందించలేదు.
రెండు సార్లు ఊళ్లోకి వచ్చి, అది ఆకలిచావు కాదనడానికి రుజువులు సేకరించేందుకు విఫలయత్నం చేశారు. రాంగడ్ కు చెందిన ఉపాసీ దేవి అనే మహిళ ఏప్రిల్ 1న చనిపోయింది. రెండ్రోజుల తర్వాత గ్రామానికి వెళ్లిన అధికారులు.. మృతురాలి ఫ్యామిలీకి 10 కేజీల పిండి, రూ.6వేలు నగదు ఇచ్చి, అది ఆకలి చావు కాదనే రిపోర్టుపై సంతకాలు తీసుకున్నట్లు వెల్లడైంది.
అడుక్కుందామన్నా కుదరక..
గర్వా జిల్లాలోని మారుమూల గ్రామంలో నివసించే చంద్రావతి దేవి(32) తన ఇద్దరు పిల్లల పరిస్థితి తల్చుకుని దీనంగా ఏడుస్తోంది. భర్తతోపాటు ఆమె కూడా స్థానికంగా ఇటుక బట్టీల్లో కూలీ పనిచేస్తుంది. శనివారం మీడియావాళ్లు కలిసేనాటికి.. మూడు రోజులుగా వాళ్లు ఏమీ తినలేదు. ‘‘పని దొరక్కపోవడం ఒకటైతే, కనీసం భిక్షమెత్తే పరిస్థితి కూడా లేదు.
బయటికి రావొద్దని చాటింపులు వేయడంతో, ఊళ్లో ఎవరూ ఎవర్నీ రానివ్వడంలేదు. చుట్టుపక్కల అందరిదీ దాదాపు మాలాంటి పరిస్థితే''అని చంద్రావతి కన్నీటిపర్యంతమయ్యారు. బొకారో జిల్లా గోమియా బ్లాక్ లో నివసించే జీతన్ మరాండీ.. రోజు కూలీగా పనిచేసేవాడు. లాక్ డౌన్ తో పనిలేక పస్తులుంటున్నారు. వాళ్లకు వికలాంగురాలైన 17ఏళ్ల కూతురుంది. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశతో.. కూతురు చనిపోయిందంటూ వారు దరఖాస్తు చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద కార్యకర్త.. వాళ్లతో అలా పిటిషన్ వేయించాడని తేలడంతో వ్యవహారం అరెస్టు దాకా వెళ్లింది. జార్ఖండ్ లోని 19 జిల్లాల్లో 50కిపైగా బ్లాకుల్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఇలా ఒక్కో ఊళ్లో ఎన్నో ఆకలిగాథలు వెలుగులోకి వస్తున్నాయి..
సూరత్లో నేత కార్మికులు..
తొలి దశ లాక్ డౌన్ లో ఎలాగోలా సర్దుకుపోయిన వలస కూలీలు.. లాక్ డౌన్ పొడగింపుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ప్రధానంగా దేశ టెక్స్ టైల్ రాజధానిగా పేరుపొందిన సూరత్(గుజరాత్)లో గత గురువారం నుంచి వలస కూలీలు వరుసగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. సూరత్ సిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో పనిచేసే వీరంతా.. సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని పట్టుపడుతున్నారు. గురువారం రాత్రి నుంచి రోడ్లపైనే బైఠాయించారు. అక్కడక్కడా ఆస్తులు, వాహనాలు తగులబెట్టారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
ఢిల్లీలో బీభత్సం..
దేశరాధాని ఢిల్లీ నుంచి ఇప్పటికే వేల మంది వలస కూలీలు యూపీ, బీహార్ లోని తమ సొంత ఊళ్లకు నడచి వెళ్లిపోయారు. మిగిలిన ఇంకొంత మంది షెల్టర్ హోమ్స్ లో కాలం గడుపుతున్నారు. ఢిల్లీ కాశ్మీరీ గేటు దగ్గరున్న షల్టర్ హోంలో నిర్వాహకులుకు, కూలీలకు మధ్య గొడవ ముదరడంతో ఏకంగా హోంకు నిప్పుపెట్టారు. సరుకులు, దుప్పట్లు అన్నీ మంటల్లో కాలిపోయాయి. అంతకు ముందురోజే ఓ యువకుడు ప్రమాదవశాత్తూ యమునా నదిలో పడి చనిపోయాడు. అతని మరణంపై తలెత్తిన విదాదమే క్రమంగా హింసకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగుర్ని అరెస్టుచేశారు.
Recommended Video