మేకిన్ ఇండియా: ఇక భారత్లో లాక్ హీడ్ మార్టిన్ యుద్ధ విమానాలు ఎఫ్ - 21 ఉత్పత్తి
బెంగళూరు : అమెరికా రక్షణ శాఖకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఎఫ్ -21 ఫైటర్ జెట్ను బెంగళూరులో ఆవిష్కరించింది. ఇకపై మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేసేందుకు లాక్హీడ్ మార్టిన్ ఆసక్తి కనబర్చింది. భారత వాయుసేన కోసం ప్రత్యేకమైన సదుపాయాలతో ఈ విమానం డిజైన్ కానుంది.
బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2019 ఎయిర్ షోలో ఎఫ్-21 యుద్ధ విమానంను ప్రదర్శించారు. భారత్లో మేకిన్ ఇండియా ప్రొగ్రామ్ కింద టాటా సంస్థతో కలిసి ఎఫ్-21 యుద్ధ విమానాలను తయారు చేస్తామని లాక్హీడ్ మార్టిన్ సంస్థ తెలిపింది. ఇప్పటికే భారత్కు లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఎఫ్ -16 యుద్ధ విమానాలు వాయుసేనలో సేవలందిస్తున్నాయి. భారత వాయుసేనకు కావాల్సిన అన్ని సదుపాయాలతో ఎఫ్ - 21 యుద్ధ విమానం రూపుదిద్దుకుంటుందని సంస్థ హామీ ఇచ్చింది. ఎఫ్ -21 యుద్ధ విమానం బయట, లోపల తేడా కలిగి ఉంటుందని అన్నారు లాక్హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ భారత వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ లాల్.
ఈ యుద్ధ విమానం తయారైతే ప్రపంచ విమానాయాన రంగంలో భారత్ మరో కలికితురాయిని చేరుకుంటుందని డాక్టర్ వివేక్ లాల్ అభిప్రాపడ్డారు. అంతేకాదు భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మకమైన సత్సంబంధాలు నెలకొంటాయని చెప్పారు. లాక్హీడ్ మార్టిన్ యుద్ధ విమానాయాన సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 1,05,000 మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ యుద్ధ విమానంకు కావాల్సిన డిజైన్, దాని అభివృద్ధిని, తయారు, అత్యాధునిక సాంకేతికత వ్యవస్థను సమకూరుస్తుంది.