నా పనివేళలు అయిపోయాయి: మార్గ మధ్యలోనే రైలును నిలిపేసిన లోకోపైలట్
నాగపట్టిణం: సాధారణంగా ఒక రైలును ఎక్కడ నిలుపుతారు... ప్యాసింజర్ రైలు అయితే రైల్వేప్లాట్ఫాం పై నిలుపుతారు. అదే గూడ్సు రైలు అయితే స్టేషన్లోనే పక్కన పట్టాలపై నిలుపుతారు. కానీ ఇక్కడ ఓ లోకో పైలట్ మాత్రం ఒక ఊరికి మరొక ఊరికి మధ్యలో నిలిపాడు. అయితే దీనివెనక ఓ పెద్ద కహానీనే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మధ్యలోనే గూడ్సు రైలును నిలిపివేసిన లోకోపైలట్
ముత్తురాజ్ అనే ఓ లోకోపైలట్ తను నడుపుతున్న గూడ్సు రైలును మధ్యలోనే నిలిపివేసి ఎంచక్క తన బ్యాగును సర్దేసుకుని వెళ్లిపోయాడు. అదేంటి ఓ గూడ్సు రైలును ఎక్కడపడితే అక్కడ ఎలా నిలుపుతారు అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ ఈ లోకోపైలట్ మాత్రం కచ్చితంగా రూల్స్ అండ్ టైమింగ్స్ ఫాలో అవుతున్నట్లున్నాడు. అతని పనివేళలు ముగిశాయని చెప్పి ఏకంగా గూడ్సు బండిని ఉన్నఫలంగా ఆపేసి బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లా శీర్గాలిలో చోటుచేసుకుంది.
రైల్వే గేటు దగ్గర ఆపడంతో సహనం కోల్పోయిన వాహనదారులు
సరిగ్గా రైల్వేగేటు ఉన్న దగ్గర గూడ్సు బండి ఆగిపోవడంతో ఇరువైపుల ఉన్న వాహనదారులు ఇబ్బంది పడిపోయారు .గంట సమయం అయినప్పటికీ కూడా గూడ్సు బండి కదలకపోవడంతో అక్కడి రైల్వే గేట్ వాచ్మెన్ను ప్రశ్నించారు. దీంతో అసలు సంగతి వెలుగు చూసింది. ఇది రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ముత్తురాజ్ను ఫోనుపై సంప్రదించి గూడ్సు బండిని స్టేషన్ వరకు తీసుకురావాల్సిందిగా కోరారు. తిరిగి వచ్చిన ముత్తురాజ్ గూడ్సుబండిని స్టేషన్ వరకు తీసుకొచ్చి తన డ్యూటీ ముగిసినట్లు తెలిపాడు. గూడ్సు బండి ట్రాక్పై నిలిచిపోవడంతో ఆ రూట్లో వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యమయ్యాయి.
నిబంధనలు ఏం చెప్తున్నాయి..?
సాధారణంగా నిబంధనల ప్రకారం ఓ లోకోపైలట్ ఒకేసారి 10 గంటలకంటే ఎక్కువసేపు రైలును నడపరాదు. అయితే ఒక వేళ 12 గంటల పాటు ఒకేసారి నడపాల్సి వస్తే ముందుగానే అంటే 8 గంటల తర్వాత పైలట్ విశ్రాంతి తీసుకునేందుకు ముందుగానే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లొకేషన్లో లోకోపైలట్లు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గది లేకపోతే మరో గంట పాటు రైలును నడిపి దగ్గరలోని స్టేషన్లో ఉంచి రెస్టు తీసుకోవచ్చని నిబంధనల్లో ఉంది. అయితే జరిగిన ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు ఎంక్వైరీ వేశారు.