మరో గండం.. 27 ఏళ్లలో కనీ వినీ ఎరుగని.. భారత్పై అతిపెద్ద వినాశనకర దాడి..
మిలియన్ల కొద్దీ మిడతల దండు.. పంట పొలాలపై దండయాత్ర.. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాకిస్తాన్ మీదుగా భారత్లోకి వచ్చిన మిడతల దండు పంటలను నాశనం చేస్తోంది. మిడతల గుంపులో కేవలం ఒక చదరపు కిలోమీటరు పరిధిలోనే 80మిలియన్ల మిడతలు ఉంటాయంటే.. ఒక్కసారి కొన్ని వందల గుంపులు పొలాలపై పడితే పరిస్థితేంటి. అందుకే ప్రపంచంలోనే అత్యంత వినాశనకర తెగులుగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్లోని రాజస్తాన్,గుజరాత్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రల్లో వీటివల్ల తీవ్ర పంటనష్టం వాటిల్లుతోంది. గత 27 ఏళ్లలో ఇంత వినాశనకర దాడి మునుపెన్నడూ జరగలేదని పరిశీలకులు చెబుతున్నారు.
Recommended Video
అంఫన్ తుఫాన్ తో ఏపీకి తప్పిన గండం: ఊపిరి పీల్చుకున్న తీరప్రాంత ప్రజలు
ఇరాన్ నుంచి పాక్ మీదుగా భారత్కు..
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం.. పాకిస్తాన్ నుంచి భారత్కు వలసొచ్చిన ఈ మిడతల దండు పొడవు సుమారు 2కి.మీ నుంచి 3కి.మీ పొడవు ఉంది. ఈ 3కి.మీ పరిధిలో ఎన్నో సమూహాలు ఉంటాయి. ఒక్క సమూహాంలోనే 80 మిలియన్ల మిడతలు ఉంటే.. ఇక 3కి.మీ పొడవునా ఎన్ని సమూహాలు,ఎన్ని మిలియన్ల మిడతలు ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజానికి ఈ మిడతలన్నీ గతేడాది ఇరాన్ నుంచి బయలుదేరినవిగా చెబుతున్నారు. అక్కడి నుంచి పాకిస్తాన్కు,ఆపై భారత్కు వచ్చినట్టు చెబుతున్నారు.
రాజస్తాన్లో 5లక్షల హెక్టార్ల పంట నాశనం..
రాజస్తాన్లో దాదాపు 5లక్షల హెక్టార్లలో పంటను మిడతలు నాశనం చేశాయి. గత మూడు నెలలుగా రాజస్తాన్ ఈ మిడతల దండును ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గంగానగర్,బికనీర్,బార్మర్ జిల్లాల్లో గులాబీ రంగు మిడతలు రబీ పంటలను నాశనం చేశాయి. జోధ్పూర్,జలావర్,కరౌలీ,బుండీ ప్రాంతాల రైతులు కూడా.. తమ పొలాలపై మిడతలు దాడి చేశాయని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్రిమిసంహారక మందులు చల్లుతూ మిడతలను నివారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సమస్య జటిలమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పనిచేయని టెక్నిక్స్..
మిడతల దండును ప్రారదోలేందుకు రాజస్తాన్లోని రైతులు పలు టెక్నిక్స్ను ఉపయోగిస్తున్నారు. కొన్నిచోట్ల కంచాలు,గరిటెలు,ఇతరత్రా కిచెన్ సామాగ్రితో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల రాత్రిపూట భారీ సౌండ్తో మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల మంటలు పెట్టడం,పొలాల్లో ట్రాక్టర్లు తిప్పుతూ మిడతలను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవేవీ మిడతలపై అంతగా ప్రభావం చూపించట్లేదని రైతులే వాపోతున్నారు.ఇటీవల జైపూర్ నగరవాసులను కూడా మిడతలు బెంబేలెత్తించాయి. ఇళ్ల,గోడలు,చెట్లపై తిష్ట వేశాయి. స్థానిక అధికారులు భారీగా క్రిమిసంహారక మందులు చల్లి వాటిని తరిమే ప్రయత్నం చేశారు.
ఏయే రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు..
పంజాబ్లోని 8 జిల్లాలు,గుజరాత్లోని 5 జిల్లాలు,మధ్యప్రదేశ్లోని 16 జిల్లాలు,ఉత్తరప్రదేశ్లోని 17 జిల్లాలు,మహారాష్ట్రలో తూర్పు ప్రాంతం వైపున్న జిల్లాల్లోని పంటలు మిడతల బారినపడ్డాయి. గత కొద్దిరోజుల్లో మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలకు కూడా మిడతలు వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. భారత్లో గత 27 ఏళ్లలో ఇదే అతిపెద్ద వినాశనకర దాడి అని ఐరాసలోని మిడతల అంచనా అధికారి పేర్కొన్నారు. సోమాలియా,ఇథియోపియాలో గత 25 ఏళ్లలో జరిగిన అతిపెద్ద మిడతల దాడి అని,కెన్యాలో 70 ఏళ్లలో జరిగిన అతిపెద్ద మిడతల దాడి అని చెప్పారు.
పొంచి వున్న గండం..
ఆఫ్రికా ప్రాంతంలో అనుకోని తుఫాన్ల కారణంగానే ఈ మిడతల దాడులు మొదలయ్యాయని సైంటిస్టులు చెబుతున్నారు. అరేబియన్ ద్వీపకల్పంలో (మే,అక్టోబర్ 2018) వచ్చిన రెండు తుఫాన్ల నుంచే ఈ మిడతలు ఉద్భవించాయని.. అవి మూడు తరాల సంతానోత్పత్తి చేశాయని.. అంటే,వాటి సంఖ్య 8వేల రెట్లు పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం భారత్,పాకిస్తాన్,బలూచిస్తాన్లలో ఇవి పంటలను నాశనం చేస్తున్నాయి. ఆఫ్రికా ద్వీపకల్పంలోని మిడతల సంతానోత్పత్తి వచ్చే నెల నాటికల్లా భారత్ రావచ్చునని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భారత్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. FAO(Food and Agriculture Organization of the United Nations) కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మిడతల దాడులకు కుదేలవుతున్న దేశాలకు ఐరాస సాయమందిస్తోంది. ఈ నేపథ్యంలో మిడతలపై కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని పాకిస్తాన్,ఇరాన్లకు సైతం భారత్ పిలుపునిచ్చింది. దీనిపై పాక్ నుంచి ఇంకా స్పందన రాలేదు.