2019 ఎన్నికలు: బీహార్లో జేడీయూ-బీజేపీ 50-50
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో జనతాదళ్(యు)కి, భారతీయ జనతా పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. రెండు పార్టీల మధ్య లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం సమానంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం వెల్లడించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో అమిత్ షా 2019 లోక్సభ ఎన్నికల సీట్ల పంపకం విషయమై భేటీ అయ్యారు. బీజేపీ కూటమి పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీకి సీట్ల పంపకం విషయంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని అమిత్ షా పేర్కొన్నారు. పార్టీతో కొత్త భాగస్వామి వచ్చి కలిసినప్పుడు.. పరిస్థితులను బట్టి మనం త్యాగం చేయక తప్పదని ఆయన తెలిపారు.
అమిత్ షా ప్రకటనను బట్టి చూస్తే.. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ తాను పోటీ చేయనున్న ఎంపీ స్థానాల సంఖ్య తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది. బీహార్లో 40 లోక్సభా స్థానాలున్నాయి. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో జనతాదళ్తో పాటు, లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్ పాశ్వాన్), రాష్ట్రీయ లోక్సమతా పార్టీ(ఉపేంద్ర కుష్వా)లు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూటమిలో మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం గురించి రెండు, మూడు రోజుల్లో పూర్తి సమాచారం వెల్లడించనున్నట్లు అమిత్ షా తెలిపారు. కాగా, 2014లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఏ పార్టీతో పొత్తులేకుండా మొత్తం 40స్థానాల్లో పోటీచేయగా కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమి మాత్రం 40 స్థానాల్లో పోటీ చేయగా 31చోట్ల విజయం సాధించింది.