పార్లమెంటు సమావేశాలు: బీజేపీ, విపక్షాల వాగ్వాదం, తోపులాటతో తీవ్ర గందరగోళం
న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంటు రెండో విడత సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లపై లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు బలంగా తోసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి ప్రారంభమైన సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.
సోమవారం సభ ప్రారంభమైన అనంతరం జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ తోపాటు విపక్ష సభ్యులు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నల్ల బ్యానర్లతో ట్రెజరీ బెంచ్ల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పలుమార్లు కోరినప్పటికీ వారు వినిపించుకోలేదు. అంతేగాక, కొందరు సభ్యులు కాగితాలు చింపి సభలోనే విసిరేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల వద్దకు బీజేపీ వెళ్లడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇరుపక్షాల సభ్యులు తోపులాడుకున్నారు. గందరగోళం చోటు చేసుకోవడంతో స్పీకర్ సభను 3గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ సభ్యుల తీరు మారలేదు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు తోపులాడుకున్నారు. మూడుసార్లు సభ వాయిదా పడింది. ఇక పరిస్థితి మారేలా కనిపించకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే, ఇంత గందరగోళంలోనూ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్లు, మినరల్ లాస్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టడం గమనార్హం.
పెద్దల సభలోనూ అధికార, విపక్షాల సభ్యుల వాగ్వాదం, తోపులాడ చోటు చేసుకుంది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. హోంమంత్రి, ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక్కడ కూడా సభ్యులు శాంతించకపోవడంతో రాజ్యసభ కూడా మంగళవారానికి వాయిదా పడింది. కాగా, పార్లమెంటు ఆవరణలోనూ విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు.