మాజీ ప్రధాని మనుమడికి సినిమా కష్టాలు: ఎంపీగా పోటీ, ఆస్తుల వివరాలు లేవు, విచారణకు ఈసీ !
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ మనుమడు, హాసన్ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణకు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే సినిమా కష్టాలు మొదలైనాయి. లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేసే సమయంలో ఎన్నికల అధికారులకు సమర్ఫించిన పత్రాల్లో ఆస్తుల పూర్తి వివరాలు వెల్లడించలేదని ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ హాసన్ జిల్లాధికారికి విచారణ చెయ్యలాని ఆదేశాలు జారీ చెయ్యడంతో జేడీఎస్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఆస్తులు, అప్పులు
హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో తనకు రూ. 7.38 కోట్ల ఆస్తి ఉందని, రూ. 3.72 కోట్ల రుణం ఉందని అఫిడవిట్ సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో ఆయన ఆస్తుల వివరాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి ఎ. మంజు, ఆర్ టీఐ కార్యకర్త టీజే. అబ్రహాం ఎన్నికల కమిఫన్ కు ఫిర్యాదు చేశారు.
ఈసీకి ఫిర్యాదు
ప్రజ్వల్ రేవణ్ణ సమర్పించిన అఫిడవిట్లు పరిశీలించాలని ఎన్నికల కమిషన్ హాసన్ జిల్లాధికారికి సూచించింది. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తల్లి భవాని రేవణ్ణ వేరేవేరే కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయి. అంతే కాకుండా హాసన్ లో వారి పేర్ల మీద కల్యాణమండపం ఉంది. వీటితో పాటు వారి ఆస్తుల పూర్తి వివరాలు అఫిడవిట్ లో పొందుపరచలేదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
నివేదిక ఇవ్వండి
ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ లోని ఆస్తుల విషయంలో బీజేపీ అభ్యర్థి ఎ. మంజు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఆస్తుల వివరాలు, ఆయన సమర్పించిన అఫిడవిట్ లోని ఆస్తుల వివరాలు సక్రమంగా ఉన్నాయా ? లేదా ? అనే విషయంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని హాసన్ జిల్లాధికారికి ఎన్నికల కమిషన్ సూచించింది.
ప్రజ్వల్ ఆస్తులు
హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు ఈవిదంగా ఉన్నాయి. తనకు రూ. 7, 39, 21, 662 విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 1, 100 గ్రాముల బంగారం, 23 కేజీలతో పాటు రూ.37 ,31 ,350 విలువైన బంగారు నగలు ఉన్నాయని ప్రకటించారు. మైసూరులో రూ.1. 90 కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ ఉందని వివరించారు.
అవ్వకు అప్పు ఇచ్చిన ప్రజ్వల్
రూ. 7 కోట్ల ఆస్తులు ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ అంతే మొత్తంలో రుణం తీసుకున్నానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. తల్లి భవాని రేవణ్ణ నుంచి రూ. 43, 75, 000 రుపాయలు, తండ్రి రేవణ్ణ నుంచి రూ. 1, 26, 000, తాత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నుంచి రూ. 5 లక్షలు, అత్త అనసూయ మంజునాథ్ నుంచి రూ. 22 లక్షలు, అత్త శైలా నుంచి రూ. 10, 50, 000 రుణం తీసుకున్నానని ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్ సమర్పించారు. అవ్వ చెన్నమ్మకు రూ. 23 లక్షలు, సోదరుడు సూరజ్ కు రూ. 37, 29, 000 రుణం ఇచ్చానని, చేతిలో రూ. 26, 99, 848 ఉందని అఫిడవిట్ లో ప్రజ్వల్ వివరాలు పొందుపరిచారు.