ఏ పార్టీకి ఓటు వేసినా హెయిర్ కటింగ్, షేవింగ్ ఫ్రీ, బెంగళూరులో బంపర్ ఆఫర్, ఓటు పవిత్రమైంది!
బెంగళూరు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లకు వివిద రకాల బహుమతులు ఇస్తుంటారు. ఒక్క ఓటుకు వేల రూపాయల నగదు ఇవ్వడం మనం చూస్తుంటాము. ఒక్క నియోజక వర్గం గెలుపు కోసం రూ. 150 కోట్ల వరకూ ఖర్చు పెట్టారనే వార్తలు మనం చూశాం. అయితే రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఓటు వేసి దాని పవిత్రను కాపాడే ఓటర్లకు ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నారు.
మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని మాకు సంబంధం లేదు, పవిత్ర మైన ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచే ప్రతి ఒక్కరు మాకు దేవుడితో సమానం. ఓటు వేసి వచ్చే ప్రతి ఒక్కరికి మేము ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తామని బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ అన్నారు.
ఓటు వేసే వారికి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి గెలుపు కోసం నగదుతో పాటు ఖరీదైన చీరలు, మిక్సీలు, మొబైల్ ఫోన్లు, బంగారు, వెండి నాణెలతో పాటు వివిద రకాల బహుమతులు ఇస్తుంటారు. అయితే రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని శ్రీనివాస్ ఓటర్ల కోసం ఉచిత సేవ చెయ్యాలని సిద్దం అయ్యారు.
బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని కోడిచిక్కనహళ్ళిలో శ్రీనివాస్ గత 40 సంత్సరాల నుంచి గుడ్ లైన్స్ పాల్లర్ నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ తో పాటు ఆయన ఇద్దరు కుమారులు క్షౌరం పని చేస్తున్నారు. ఏఫ్రిల్ 18వ తేదీ ఓటు వేసిన వారు తమ సెలూన్ వస్తే ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తామని ప్రకటించారు.
ఏఫ్రిల్ 18వ తేదీ ఓటు వేసిన వారు శ్రీనివాస్ సెలూన్ దగ్గర క్యూకట్టారు. శ్రీనివాస్ తో పాటు ఆయన ఇద్దరు కుమారులు ఓటు వేసి వచ్చిన వారికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నారు. రద్దీ ఎక్కువ అయినా ఎవ్వరిని వెనక్కి పంపిచడం లేదు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు తాము ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.
బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గంలోనే కాదు ఎక్కడ ఓటు వేసినా ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులతో కలిసి శ్రీనివాస్ క్షౌరం పని చేస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సందర్బంగా ఓటు వేసిన వారికి శ్రీనివాస్, ఆయన కుమారులు ఉచితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేశారు.