ఆన్ లైన్ సౌకర్యం: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా తెలుసుకోవచ్చు..!
న్యూఢిల్లీ: ఎన్నికల కోలాహలం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో? లేదో? అనే కంగారు ఓటర్లలో తరచూ వ్యక్తమౌతుంటుంది. ఆన్ లైన్ సౌకర్యం అందుబాటులో రావడం వల్ల తమ పేర్లను తెలుసుకోవడం సులభతరమైంది. దీనికోసం చేయాల్సింది ఒక్కటే. నేషనల్ ఓటర్ పోర్టల్ https://electoralsearch.in/ లో ఓటును చూసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇలా తెలుసుకోవచ్చు..
ఈ వెబ్సైటును ఓపెన్ చేసిన తరువాత అందులోని కాలమ్ లల్లో సూచించిన విధంగా ఓటర్లు తమ పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత పొందు పరచాలి. తమ స్వరాష్ట్రం, జిల్లా, తాము ఏ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తారనేది ఎంచుకోవాలి. అనంతరం కింది బాక్సులో చూపిన కోడ్ ను ఎంటర్ చేయాలి. సెర్చ్ అనే పదాలపై క్లిక్ చేయగానే.. అన్ని వివరాలు ప్రత్యక్షమౌతాయి. ఎన్నికల గుర్తింపు కార్డు ఉంటే.. అందులో ఉన్న నంబర్ ను కూడా సంబంధింత కాలమ్ బాక్స్ లో పొందుపరచవచ్చ.
మై ఓట్ యాప్ ద్వారా కూడా..
ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం `మై ఓట్` అనే యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కూడా ఓటర్లు తమ ఓటు వివరాలు, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం, పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. 9223166166 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించటం ద్వారా కూడా పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవచ్చు. దీనితోపాటు- 51969 నంబరుకు మెసేజ్ పంపటం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.
ఓటేయడానికి వెళ్తున్నారా? స్లిప్ ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ గుర్తింపుకార్డులు దగ్గరుంచుకోండి?
ఓటరు గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లినప్పటికీ.. ఏదైనా మరొక కార్డు ఉండటం మంచిది. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ/ప్రభుత్వేతర/ప్రైవేటు విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కార్డు, కార్మిక శాఖ మంజూరు చేసిన ఆరోగ్య బీమా కార్డు, ఫొటో ఉన్న పింఛన్ కార్డు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వరంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు కార్డులను ప్రత్యామ్నాయంగా చూపించవచ్చు.
సెల్ ఫోన్లు నిషేధం..
ఓటర్లు తమ వెంట ఎవరూ సెల్ ఫోన్లను తీసుకెళ్ల కూడదు. అవి వెంట ఉంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. మద్యం సేవించి ఓటు వేయడానికి వెళ్లకూడదు. పోలీసులు సూచించిన నిబంధనల ప్రకారం.. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి మారణాయుధాలు తీసుకెళ్లరాదు. అలాగే- వాటర్ బాటిల్స్ గానీ ఇంకు బాటిల్స్ కానీ తీసుకెళ్ల కూడదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు ,టోపీలు, కండువాలు, జెండాలతో పోలింగ్ కేంద్రాల సమీపంలో తిరుగాడకూడదు. వారిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది.
పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉండవచ్చు. ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఎక్కువ మందితో గుమికూడి ఉండటానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. పార్టీ జెండాలు కానీ గుర్తులు కానీ బ్యానర్లు గాని ప్రదర్శించరాదు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తు రంగులు అభ్యర్థి పేర్లు మొదలగునవి కలిగిన వాటిపైన ఇవ్వరాదు.