లోక్ సభ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే అనుచరులకు ఐటీ శాఖ షాక్, దెబ్బకు హడల్!
బెంగళూరు: కర్ణాటకలో రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు (ఐటీ శాఖ) దాడులు చేశారు. బెళగావి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ ముఖ్య అనుచరుల మీద ఐటీ శాఖ దాడులు చేసింది.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ప్రధాన అనుచరుడు శంకర్ గౌడ పాటిల్ ఫాం హౌస్, ఇల్లు తదితర ప్రాంతాల్లో ఐటీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు దాడులు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
బెళగావి నగరం సమీపంలోని వీకరణకోప్ప ప్రాంతంలోని శంకర్ గౌడ ఫాం హౌస్ లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక- గోవాకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒక్క రోజు వ్యవదిలో రెండో విడత పోలింగ్ జరగనున్న సమయంలో ఐటీ శాఖ దాడులు బెళగావిలో కలకలంరేపాయి.
రాజకీయ కక్షతోనే తన అనుచరుల మీద ఐటీ దాడులు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ మండిపడుతున్నారు. బెళగావి సమీపంలో నగదు సాగిస్తున్న శ్రీకాంత్ మునవళ్ళి అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బెళగావి జిల్లా సవదత్తి తాలుకా మునవళ్ళికి చెందిన శ్రీకాంత్ నుంచి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు అతన్ని విచారణ చేస్తున్నారు. రూ. 14 లక్షలకు సరైన ఆదారాలు లేవని, శ్రీకాంత్ ను విచారణ చేస్తున్నామని ఐటీ శాఖ, ఎన్నికల అధికారులు తెలిపారు.