దక్షిణాదికి కొత్త పొత్తుతో బీజేపీ, తమిళనాట 5 సీట్లలో పోటీ, 7 స్థానాల్లో పీఎంకే
చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేలతో పాటు పీఎంకే (పట్టాలి మక్కాల్ కచ్చి) పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. తమిళనాడులో మొత్తం 39 లోకసభ స్థానాలు ఉన్నాయి. వచ్చే లోకసభ, ఆ తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనతో పొత్తు కుదిరింది. ఇప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు ద్వారా దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తమిళనాడులో తమ పార్టీని విస్తరించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
బీజేపీ, పీఎంకే, అన్నాడీఎంకే.. ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తాయంటే
రాబోయే లోకసభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. 39 స్థానాలకు గాను బీజేపీ 5, పీఎంకే 7 లోకసభ స్థానాల్లో పోటీ చేయనుంది. మిగతా సీట్లలో అన్నాడీఎంకే పోటీ చేస్తుంది. పుదుచ్చేరిలోని లోకసభ స్థానం కోసం మూడు పార్టీలు కలిసి పని చేయనున్నాయి. పొత్తుపై ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, కేంద్రమంత్రి పీయూష్ గోయల్లు కలిసి ప్రకటన చేశారు.
కొత్త ట్విస్ట్, కలిసిన శివసేన-బీజేపీ, ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారంటే? కన్ఫ్యూజన్ అంటూ ఉద్ధవ్
కలిసి ముందుకు సాగుతాం
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే అలయెన్స్పై పన్నీరుసెల్వం మాట్లాడుతూ.. తమది విజయం సాధించే మెగా కూటమి అన్నారు. బీజేపీ 5 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో కలిసి పోటీ చేస్తామన్నారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తమిళనాడులో జరగనున్న ఉప ఎన్నికల్లో తాము అన్నాడీఎంకేకు మద్దతిస్తున్నామని చెప్పారు. తాము పన్నీరుసెల్వం, పళనిస్వామిల నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమితో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో, కేంద్రంలో మోడీ నేతృత్వంలో కలిసి పని చేస్తామన్నారు.
పీఎంకేకు రాజ్యసభ సీటు కూడా
మరోవైపు, మంగళవారం అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలకు చెందిన నేతలు చెన్నైలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. పీఎంకేకు 7 చోట్ల సీటు ఇవ్వడంతో పాటు ఓ రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో పీఎంకే చేరిందని చెప్పారు. పీఎంకే 7 లోకసభ స్థానాల్లో పోటీ చేయనుందని చెప్పారు. పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ మాట్లాడుతూ.. తాము అన్నాడీఎంకేతో ఎందుకు కలిశామో వివరణ ఇచ్చారు. తమది గెలుపొందే కూటమి అన్నారు. తాము అన్నాడీఎంకే ముందు పది షరతులు లేదా డిమాండ్లు పెట్టామని, వాటికి అంగీకరించిందని, అందుకే కూటమిలో చేరామని చెప్పారు.