ముందస్తుకే మొగ్గు: ఏకకాల ఎన్నికలపై మోడీ ఫోకస్.. తెలంగాణ, ఏపీల్లోను?
2018నవంబర్-డిసెంబర్ లలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఏపీ, తెలంగాణ, ఒడిషా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరపాలని భావిస్తోంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఊపు మీదున్న బీజేపీ.. ఈ ఊపును ఇలాగే కొనసాగించాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే సరైందిగా భావిస్తోంది. 2019సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే దేశంలో ఎన్నికల నగారా మోగించాలని యోచిస్తోంది.
ఈ మేరకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాల్లో ముందస్తుకే మొగ్గుచూపేలా కసరత్తులు చేస్తోంది. 2018నవంబర్-డిసెంబర్ లలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఏపీ, తెలంగాణ, ఒడిషా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరపాలని భావిస్తోంది.
ఏకకాల ఎన్నికల ప్రక్రియ:
ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు అనువుగా.. సాధ్యమైనంత ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్ లో ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ప్రజాధనంతో పాటు, సమయం కూడా వృథా అవుతోందని ప్రధాని మోడీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాజ్యాంగ సవరణ అవసరమా?
రాజ్యాంగ నిపుణులు, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ తాజాగా దీనిపై స్పందించారు. 'పార్లమెంటు ఎన్నికలతో పాటు 6నెలల్లో గడువు తీరే అసెంబ్లీలకు ఈసీ ఎన్నిక నిర్వహించవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు' అని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా అసెంబ్లీల కాలపరిమితి ముగిసిన 6నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఇది సాధ్యపడకపోతే రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకెళ్లాల్సి ఉంటుంది.
అధికార పార్టీలు ఒప్పుకుంటే?:
2019 ఏప్రిల్ లో నిర్వహించాల్సిన లోక్ సభ ఎన్నికలను వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్ లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం, అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశాలున్నాయని కశ్యప్ అన్నారు. అదే సమయంలో.. తెలంగాణ, ఏపీ, ఒడిశాలో అధికార పార్టీలు అంగీకరిస్తే.. ముందస్తు ఎన్నికలు రావచ్చునని పేర్కొన్నారు.
ఇప్పుడు కాకపోతే ఇక కష్టం:
ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీల గడువును రద్దు చేసుకునే అవకాశం ఉందని కశ్యప్ అభిప్రాయపడ్డారు. ఏకకాల ఎన్నికలకు 2019లోక్ సభ ఎన్నికలు అనువుగా ఉండకపోతే.. ఇక మరో 10ఏళ్ల పాటు ఈ ప్రక్రియ ఒక కొలిక్కిరాదని అన్నారు.