కొత్త ట్విస్ట్, కలిసిన శివసేన-బీజేపీ, ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారంటే? కన్ఫ్యూజన్ అంటూ ఉద్ధవ్
ముంబై: లోకసభ ఎన్నికలకు ముందు మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై శివసేన నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కూడా శివసేన పలుమార్లు చెప్పింది. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
అమిత్ షా, ఫడ్నవీస్, థాకరే కలిసి ప్రెస్ మీట్
మహారాష్ట్రలో బీజేపీ, శివసేనలు కలిసి పోటీ చేయాలని సోమవారం నిర్ణయించాయి. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తదితరులు చర్చలు జరిపారు. అనంతరం వారు సీట్ల పంపకాలపై మీడియాతో మాట్లాడారు. తాము కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రానున్న లోకసభ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోను కలిసి పోటీ చేస్తామని చెప్పారు.
ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారంటే
ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దేశంకోసం ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావాలని, అందుకే బీజేపీ, శివసేన గతంలో వలె కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చెరీసగం సీట్లు తీసుకొని పోటీ చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలపై ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ అంశం మీద పొత్తులపై ఇతర మిత్ర పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లు పోను.. మిగతా సీట్లలో బీజేపీ, శివసేన చెరీసగం పోటీ చేస్తుందని చెప్పారు.అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శివసేన డిమాండ్ చేస్తోందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఉద్ధవ్ థాకరే ఏమన్నారంటే
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి (ఫడ్నవీస్) అన్ని విషయాలు చెప్పారని, కాబట్టి తాను చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. పుల్వామా తీవ్రవాద దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నానన్నారు. అనంతరం ఉద్ధవ్ మాట్లాడుతూ.. గత ఇరవై అయిదేళ్లు ముప్పై ఏళ్లుగా ప్రజలు బీజేపీ, శివసేనలను కలిపి చూస్తున్నారని చెప్పారు. తాము కలిసి పని చేశామని అన్నారు. ఈ అయిదేళ్లలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ వచ్చిందని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి (ఫడ్నవీస్) చొరవతో ఈ నిర్ణయానికి వచ్చామని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల గడువు ఉందని, సగం సగం స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.
అమిత్ షా ఏమన్నారంటే
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ.. 48 లోకసభ సీట్లకు గాను బీజేపీ, శివసేనలు కలిసి 45 స్థానాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేయకుంటే ఇద్దరు దెబ్బతినే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో కలిసి పోటీ చేస్తున్నారు.