వ్యవసాయ బిల్లులకు లోక్సభ ఆమోదం - నిరసనగా 25న భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు
వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక సంస్కరణలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోన్న కీలక బిల్లులు లోక్ సభ గట్టెక్కాయి. గురువారం నాటకీయ పరిణామాల మధ్య బిల్లులు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్లో నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు మంగళవారమే ఆమోదం పొందగా.. మిగిలిన రెండు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లుకు గురువారం ఆమోదం లభించింది. అయితే, వీటిని వ్యతిరేకిస్తోన్న రైతు సంఘాలు కేంద్రం తీరుకు నిరసనగా సెప్టెంబర్ 25న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ
కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లులకు ఎన్టీఏ మిత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు బిల్లులను రైతు వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించగా, వైసీపీ మద్దతు పలికింది. గురువారం రెండు బిల్లులపై చర్చలో పాల్గొన్న వివిధ పార్టీల ఎంపీలు ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఏడు గంటలకే ముగియాల్సిన లోక్ సభ.. వ్యవసాయ బిల్లులపై చర్చ కారణంగా రాత్రి 10 వరకు కొనసాగింది. చివరికి బిల్లులు ఆమోదం పొందడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
కీలకమైన వ్యవసాయ బిల్లులు లోక్ సభలో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ''లోక్సభలో చరిత్రాత్మక వ్యవసాయ సంస్కరణ బిల్లులు ఆమోదించడం.. దేశంలోని రైతులకు, వ్యవసాయ రంగానికి ముఖ్యమైన క్షణం. ఈ బిల్లులు రైతులను.. మధ్యవర్తులు, ఇతర అడ్డంకుల నుండి విముక్తి చేస్తాయి'' అని మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి పదవికి కౌర్ రాజీనామా - అకాలీదళ్ సంచలనం - వ్యవసాయ బిల్లులపై బీజేపీకి భారీ షాక్
కేంద్రం చెబుతున్నట్లు ఈ మూడు వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరగబోదని, అన్నదాతను మరింత బలహీనం చేస్తాయని, వ్యవసాయ రంగంలో దళారీలు, కార్పొరేట్ శక్తులు మరింత బలపడేందుకు ఈ బిల్లులు తోడ్పడతాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతుల గోడు వినిపించుకోకుండా, ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదించుకున్న కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 25న భారత్ బంద్ తలపెట్టినట్లు రైతు సంఘాల ఐక్యవేదిక.. ''ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్సీసీ) ప్రకటించింది.
Recommended Video
రైతులకు మద్దతుగా హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేయడం సాహసోపేత నిర్ణయమని లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకే చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం.. కౌల్ నిర్ణయం చాలా చిన్నదని, అది కూడా ఆలస్యంగా తీసుకున్నారని, అకాలీదళ్ ఇప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతుండటం ద్వంద్వప్రమాణాలకు సంకేతమని వ్యాఖ్యానించారు.