బాలికలపై లైంగికదాడికి పాల్పడితే మరణశిక్షే: లోక్సభలో బిల్లుకు ఆమోదం
Recommended Video
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు మరణదండన విధించడం సహా- లైంగిక నేరాల శిక్షలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం లభించింది.
ఏప్రిల్లో జారీ చేసిన అత్యవసరాదేశం స్థానంలో దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టారు. బిల్లు మూజువాణి తీర్మానంతో ఆమోదం పొందింది. చట్టాన్ని రూపొందించడానికి ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవడంపై కొన్ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆ మేరకు అవి ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.
రెండు గంటలపాటు జరిగిన చర్చకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినప్పుడు శిక్షలకు ప్రత్యేకంగా నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వం ఆ మేరకు మార్పుల్ని ప్రతిపాదించిందన్నారు. నూతన నిబంధనలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఉప సభాపతి ఎం.తంబిదురై సూచించారు.
'12 ఏళ్లలోపు బాలికలపై రేప్నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష అమలవుతుంది' అని కేంద్రమంత్రి చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
కాగా, ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును వ్యతిరేకించారు. కఠినమైన చట్టం ఉండాల్సిందేననీ, ప్రతిపాదిత శాసనం మాత్రం భారత్ను సౌదీ అరేబియా, ఇరాన్ల చెంతన నిలబెడుతుందనీ చెప్పారు. బాలికలనే కాకుండా మైనర్ బాలురనూ దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే సూచించారు.
ఇది ఇలావుంటే, మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ వెల్లడించారు.