వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే
న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రతిపాదించింది. ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వెల్లూరులో రేపు లోక్ సభ ఎన్నిక జరగదని సీఈసీ వర్గాలు స్పష్టంచేశాయి.
పట్టుబడ్డ నగదు
కొద్దిరోజుల క్రితం వెల్లూరులో డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. ఐటీశాఖ తనిఖీల్లో ఆ నగదు రూ.12 కోట్లని తేలింది. ఈ నెల 10న ఐటీశాఖ నివేదిక ఆధారంగా కదిర్ ఆనంద్ సహా మరో ఇద్దరు పార్టీ నేతలపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
37 స్థానాల్లో ఎన్నికలు
రెండో విడత పోలింగ్ సందర్భంగా గురువారం తమిళనాడులోని 38 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండేది. వెల్లూరు రద్దవడంతో 37 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశ చరిత్రలో ఒక ఎన్నికను రద్దుచేయడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమిళనాడులో నగదు ఎరులై పారుతోంది. ఇప్పటికే రూ.500 కోట్ల విలువజేసే నగదు, నగలను సీఈసీ స్వాధీనం చేసుకుంది. ఇందులో రూ.205 కోట్లు నగదు కాగా .. మిగిలిన మొత్తం బంగారమని ఐటీ అధికారులు పేర్కొన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం
వాస్తవానికి వెల్లూరు నుంచి బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. వెల్లూరు ఎన్నికను రద్దు చేయడాన్ని అధికార డీఎంకే ఖండించింది. 'ఇవాళ ప్రజాస్వామ్యం హత్యకు గురైంది‘ అని ఆ పార్టీ నేతలు త్రీవంగా మండిపడ్డారు. వెల్లూరులో ఎన్నికల రద్దు అంశాన్ని కోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు.