కాంగ్రెస్ 26 సీట్లు...ఎన్సీపీ 22 స్థానాలు: మహారాష్ట్రలో పొత్తు ఖరారు
ముంబై:ఈ సారి లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్తుండగా 22 స్థానాల్లో శరద్ పవార్ పార్టీ పోటీ చేస్తుంది. మహాకూటమిలో భాగంగా 56 రాజకీయపార్టీలు ఒకే తాటిపైకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
శనివారం ముంబైలో రెండు పార్టీలు సంయుక్త మీడియా సమావేశంలో సీట్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ అశోక్ చవాన్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్లు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని విద్యలు ఉపయోగిస్తోందని మండిపడ్డ నేతలు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతింటున్నాయిని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు అశోక్ చవాన్. ఈ ఎన్నికల్లో బీజేపీకి అధికారం రాకుండా చూసేందుకు బీజేపీయేతర పార్టీలతో కలిసి వెళుతున్నట్లు అజిత్ పవార్ తెలిపారు. మరికొన్ని పార్టీలైతే బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. ప్రకాష్ అంబేడ్కర్ బీఆర్పీ బహుజన్ మహాసంఘ మరియు మజ్లిస్ పార్లీలను ఉద్దేశించి అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీ
ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ప్రతిపక్షనేత రాధాకృష్ణ వికే పాటిల్ గైర్హాజరయ్యారు. ఈ మధ్యే తన కుమారుడు సుజయ్ వికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు అహ్మద్ నగర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక 2014 బీజేపీతో కలిసి వెళ్లిన స్వాభిమాని షెట్కర్ పక్ష ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీకి జై కొట్టింది. ఈ పార్టీకి కాంగ్రెస్ ఒక స్థానం కేటాయించింది.ఇక వీరితో పాటు కూటమిలో ఉన్న చాలా పార్టీలకు సీట్లు కేటాయించలేదు. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో మంచి ఆదరణ ఉన్న పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.అయితే బీజేపీని ఓడించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు ఆ పార్టీ నేత జయంత్ పాటిల్.