ఇండియా టీవీ సర్వే: యూపీలో పెరిగిన బీజేపీ బలం: అభినందన్-సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ ఎవరికిచ్చారంటే?
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. కీలకమైన ఉత్తర ప్రదేశ్లో 2014 కంటే సీట్లు తగ్గినప్పటికీ, ఇటీవల వచ్చిన ప్రీపోల్ సర్వేల కంటే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని తేలింది.
చదవండి: మళ్లీ మోడీదే గెలుపు, ఏపీ, తెలంగాణలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే
సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం దేశంతో పాటు యూపీలోను బీజేపీకి ప్రాధాన్యత పెరిగిందని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం యూపీలో బీజేపీ కూటమికి 41 సీట్ల, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ (అజిత్ సింగ్) కూటమికి 35 సీట్లు వస్తాయని తేలింది. గత సర్వేల్లో ఎన్డీయేకు 29 సీట్లు వస్తాయని తేలింది. ఇప్పుడు 12 సీట్లు పెరిగాయి. ఇదంతా సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావమే అంటున్నారు. బీజేపీకి సీట్లు పెరగగా.. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి 14 సీట్లు కోతపడనుంది.
సీట్ల పరంగా చూస్తే బీజేపీకి 40, బీఎస్పీకి 16, ఎస్పీకి 18, కాంగ్రెస్కు 4, అజిత్ సింగ్ ఆర్ఎల్డీకి, అప్నాదల్కు చెరో సీటు రానుందని తేలింది. బీజేపీకి 49.95 శాతం ఓట్లు, ఎస్పీకి 17 శాతం, బీఎస్పీకి 18.03 శాతం, కాంగ్రెస్ పార్టీకి 11.37 శాతం ఓట్లు రానున్నాయి. అంటే బీజేపీ దాదాపు సగం ఓట్లు పొందనుంది.
పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులకు ఆధారాలు చూపించాలని భావిస్తున్నారా అని ఈ సర్వేలో ప్రశ్నించగా 56.91 శాతం మంది అవసరం లేదని, 22 శాతం మంది అవునని, 21.09 శాతం మంది చెప్పలేమని అన్నారు.
ఎయిర్ స్ట్రైక్స్ ప్రభావం ఉంటుందా అంటే 32.05 శాతం మంది చాలా ఉంటుందని, 40.65 శాతం అంతగా ఉండదని, 27.30 శాతం మంది చెప్పలేమని అన్నారు. భారత్ - పాక్ సమస్య పరిష్కారానికి యుద్ధమే సమాధానమా అంటే 62.82 శాతం మంది అవునని, 25.79 మంది కాదని, 11.39 శాతం మంది చెప్పలేమని అన్నారు.
తీవ్రవాదంపై బీజేపీ ప్రభుత్వం పని తీరు బాగుందని 48.99 శాతం మంది చెప్పగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీరు బాగుందని కేవలం 11.62 శాతం మంది, రెండు ప్రభుత్వాల తీరు బాగుందని 10.48 శాతం మంది, ఎవరి తీరు బాగా లేదని 20.81 శాతం మంది, చెప్పలేమని 8.10 శాతం మంది చెప్పారు.
పాక్ భూభాగంలో పడిపోయిన అభినందన్ తిరిగి రావడం క్రెడిట్ ఎవరిది అని ప్రశ్నించగా 75.41 శాతం మంది మోడీ ప్రభుత్వానిది అని చెప్పగా, కేవలం 10.12 శాతం మంది మాత్రమే అంతర్జాతీయ కమ్యూనిటీది అని చెప్పారు. 8.60 శాతం మంది పాకిస్తాన్ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వగా, 5.87 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.
కేవలం రెండు రోజుల్లోనే అభినందన్ తిరిగి రావడం డిప్లమోటిక్ గెలుపు అని 91.78 శాతం మంది అభిప్రాయపడగా, కాదని 2.25 శాతం మంది చెప్పారు. 5.97 శాతం మంది ఏమీ చెప్పలేదు.
ఈ సర్వే యూపీలో 5400 మందితో చేశారు. మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య యూపీలోని 27 లోకసభ నియోజకవర్గాల పరిధుల్లో చేశారు. 81 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్ాయి. ఈ సర్వేలో 2923 పురుషులు, 2477 మహిళలు పాల్గొన్నారు.