లాలూ దెబ్బ... పడిపోయిన నితీశ్ ఇమేజ్.. బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు... బీజేపీ ఓటర్లలో గందరగోళం
అక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మహాకూటమికి బీహార్ ఓటర్లు పట్టం కట్టినప్పటికీ... రెండేళ్లకే ఆ కూటమి విచ్చిన్నమై... అనూహ్యంగా నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిని వీడి బీజేపీతో చేరిన నితీశ్కు ప్రజాదరణ ఉందా... అధికారం కోసం ప్రత్యర్థితో చేతులు కలిపిన బీజేపీకి ప్రజామోదం ఉందా... అన్నది ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు అటు నితీశ్కు,ఇటు తేజస్వికి ప్రతిష్టాత్మకంగా మారాయి. బీహారీల ముందు నితీశ్ను దోషిగా నిలబెట్టాలని తేజస్వి... ఎంతమంది తేజస్విలు వచ్చినా బీహార్లో తనకు తిరుగులేదని నిరూపించాలని నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వే పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
ఎవరికెన్ని సీట్లు...?
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమే పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వే వెల్లడించింది. ఎన్డీయేకి 133-143 స్థానాలు,మహాకూటమికి 88-98 స్థానాలు,లోక్ జనశక్తి పార్టీకి 2-6 స్థానాలు,ఇతరులకు 6-10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఓటు బ్యాంకును పరిశీలిస్తే... ఎన్డీయేకి 28శాతం,మహాకూటమికి 32శాతం,జీడీఎస్ఎఫ్కి 7శాతం,ఎల్జేపీకి 6శాతం,ఇతరులకు 17శాతం పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
పడిపోయిన నితీశ్ ఇమేజ్...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించవచ్చునని అంచనా వేసిన లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వే... ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్కు మాత్రం ఎదురుగాలి వీస్తున్నట్లుగా గణాంకాలను వెల్లడించింది. 2010లో దాదాపు 91శాతం బీజేపీ ఓటర్లు నితీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు తెలపగా... ప్రస్తుతం అది 55శాతానికి పడిపోయినట్లు సర్వే తెలిపింది. కేవలం 58శాతం మంది బీజేపీ ఓటర్లు మాత్రమే నితీశ్కు మరోసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొంది. మొత్తంగా 31శాతం మంది బీహార్ ఓటర్లు నితీశ్కు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటుండగా.. 26శాతం మంది ఆ ఛాన్స్ ఇవ్వవద్దన్న అభిప్రాయంతో ఉన్నారు. మరో 34శాతం మంది సీఎంగా కొత్త ముఖాన్ని చూడాలనుకుంటున్నారు.
పెరిగిన లాలూ ఫ్యామిలీ పాపులారిటీ
2015లో నితీశ్ పాపులారిటీ 40శాతం,లాలూ ఫ్యామిలీ పాపులారిటీ 9శాతం ఉండగా... ఇప్పుడు నితీశ్ పాపులారిటీ 31శాతానికి పడిపోయిందని,అదే సమయంలో లాలూ పాపులారిటీ 30శాతానికి పెరిగిందని సర్వే వెల్లడించింది. ఒక రకంగా నితీశ్కు ఇది లాలూ ఫ్యామిలీ దెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల సమయంలో దాదాపు 80శాతం మంది ప్రజలు నితీశ్ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడది 50శాతానికి పడిపోయింది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం నితీశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినందునా... సహజంగానే ఆయన పట్ల ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నితీశ్ ఈసారి గనుక విజయం సాధిస్తే... అది బీజేపీ,మోదీ చలవే అని అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ ఓటర్లలో గందరగోళం...
మరోవైపు ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఈసారి విడిగా పోటీ చేస్తుండటం... జేడీయూని టార్గెట్ చేయడం వంటి పరిణామాలు బీజేపీ నితీశ్ను కాకుండా సొంత సీఎం అభ్యర్థిని కోరుకుంటోందన్న ప్రచారానికి ఊతమిచ్చాయి. దీంతో జేడీయూ ఓట్లు బీజేపీకి పోలయ్యే అవకాశం కనిపిస్తున్నా... బీజేపీ ఓట్లు జేడీయూకి పోలయ్యే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ ఆ ఓట్లను చీల్చితే... ఆ ఎఫెక్ట్ నితీశ్కు ప్రతికూలంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా బీజేపీ తమ ఓటర్లలో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టకపోతే జేడీయూ పోటీ చేస్తున్న స్థానాల్లో అగ్ర వర్ణాలు ఆ పార్టీకి ఓటు వేయకపోవచ్చునని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సభ్యుడు రాహుల్ వర్మ అభిప్రాయపడ్డారు.