ప్రయాణీకుడి జోక్ వల్లే ఆ బస్సు ప్రమాదం, 33 మంది మృతి! ఆ ఒక్కడు ఇలా బతికాడు
ముంబై: మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 33 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు ఓ ప్రయాణీకుడు వేసిన జోక్ కారణమని అంటున్నారు. దపోలీ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన బోధనా సిబ్బంది బస్సుల్లో విహారయాత్రకు వెళ్తుండగా బస్సు ప్రమాదవశాత్తూ 500 అడుగుల ఎత్తులో నుంచి పడింది.
ఈ ప్రమాదం నుంచి ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్ సహా ముప్పై మూడు మంది మృతి చెందారు. మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని భావించారు. కానీ ఓ ప్రయాణీకుడు జోక్ వేయడంతో అందరూ బిగ్గరగా నవ్వారని, దీంతో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడని, అదే సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిందని అతను చెప్పాడు.
తాను డ్రైవర్ కేబిన్ వద్ద కూర్చున్నానని, బస్సు లోపల వాళ్లు బిగ్గరగా నవ్వడంతో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడని చెప్పారు. బస్సు లోయలో పడుతుండగా ముందు భాగంలోని అద్దం ఊడిపోయిందని, తాను అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పాడు. పడిపోకుండా ఓ చెట్టుకొమ్మను పట్టుకొని దాని సాయంతో పైకి వచ్చానని చెప్పాడు.
బస్సు ఓ బండరాయిని తాకి పదిహేను అడుగుల లోతులో ఉనన చెట్టును ఢీకొట్టి కిందపడిపోయిందన్నారు. బండరాయిని తగిలినప్పుడే సగానికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని, భారీ శబ్ధం వచ్చిందని, తనతో పాటు విహారయాత్రకు వచ్చిన వారి ప్రాణాలు తన ముందే గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేకపోయానన్నారు. చెట్టు కొమ్మ సాయంతో పైకి వచ్చిన తాను.. అప్పుడు రోడ్డుపై నుంచి అటుగా వెళ్తున్న వ్యక్తి ఫోన్ అడిగి తన తోటి ఉద్యోగికి ఫోన్ చేసి విషయం చెప్పానని అన్నాడు. ఆ తర్వాత రాయ్గఢ్ పోలీసులకు సమాచారం అందించామన్నారు.
కాగా, బస్సు ప్రయాణిస్తున్న ప్రాంతంలో క్రాష్ బ్యారియర్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని మంచి కండిషన్లో ఉందన్నారు. మృతదేహాలను ట్రెక్కింగ్ రోప్స్ సాయంతో బయటకు తీసుకొచ్చారు.