ఒంటరి తనం మనుషులకే కాదు పెంపుడు జంతువులకు కూడా తెలుసు..! యజమానిని తినేసిన కుక్క..!!
డెట్రాయిట్/హైదరాబాద్: ఒంటిరి తనం మనుషులకే కాదు ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా మొహం కొట్టేస్తుందేమో..! అందుకే విశ్వాసంగా ఉండాల్సిన ఆ జీవి అందుకు విరుద్దంగా ప్రవర్తించింది. సొంత యజమానురాలు పట్ల విశ్వాసానికి మారుపేరైన ఆ జంతువు తన ఆగ్రహాన్ని చూపించుకుంది. ఇంట్లో ఓ వృద్దురాలు ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. కొన్ని రోజుల నుండి ఆ ఇంటి నుండి ఎలాంటి అలికిడి లేదు. ఇంట్లో నివసిస్తున్న వృద్ధురాలు కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు.
ఫోన్కాల్స్కు కూడా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికెళ్లిన ఆమె బంధువుకి అనుకోని షాక్ తగిలింది. ఇంట్లో కుర్చీలో ఉన్న ఆ వృద్దురాలి అస్థిపంజరాన్ని చూసి షాకైంది. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె పేరు శాలీ హనీచెక్, వయస్సు 80 ఏళ్లు. ఆమెకు తనవారంటూ ఎవరూ లేరు. వృద్ధాప్యంలోనూ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్యంతో ఆమె మంచాన పడింది. ఈ విషయం తెలిసి ఆమె పిన తల్లి కూతురు (కజిన్) లిండా కజ్మా అప్పుడప్పుడు ఆమెను కలిసి బాగోగులు చూసుకొనేది. చాలాసార్లు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చాలని కజ్మా ప్రయత్నించింది. అయితే, హనీచెక్ మాత్రం తన పెంపుడు కుక్కను, ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లలేనని చెప్పేదని కజ్మా చెప్పుకొచ్చింది.
హనీచెక్ కొద్ది రోజులుగా కజ్మా ఫోన్కు సమాధానం ఇవ్వడం లేదు. ఆమె చనిపోయిందనే అనుమానంతో ఇంటికెళ్లి చూసింది. లోపల గడియ పెట్టి ఉండటం, తలుపులు బద్దలకొట్టి వెళ్లింది. ఇల్లంతా వెతికినా ఆమె కనిపించలేదు. చివరికి వంట గది నుంచి తీవ్రమైన దర్గంధం వస్తుండటంతో అటుగా వెళ్లింది. అక్కడ కుర్చీలో అస్థిపంజరాన్ని చూసి షాకైంది. పుర్రెకు విగ్గు పెట్టినట్లు జుట్టు మాత్రమే మిగిలి ఉంది. ముఖం సగం వరకు కొరికేసినట్లు ఉంది.
అది చూడగానే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో గదిలో అనారోగ్యంతో కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె పెంపుడు కుక్క రాట్వైలర్ జాక్ను కూడా వెంట తీసుకెళ్లారు. శవ పంచనామాలో ఆమె శరీరాన్ని కొరికి తినేసినట్లు తెలిసింది. కుక్క, ఎలుకలు పీక్కుని తినేసినట్లు తేలింది. అయితే, ఆమె చనిపోయిన తర్వాతే అవి ఆమెను తిన్నాయని స్పష్టం చేశారు. ఆమెది సహజ మరణమేనని ధృవీకరించారు. ఈ ఘటన మిచిగన్లోని డెట్రాయిట్లో చోటుచేసుకుంది.