ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా
ఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తెల్లవారుజామున 12.20గం. సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇమ్మిగ్రేషన్ చెకింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
సర్వర్ సాంకేతిక లోపం కారణంగా ఎయిరిండియా సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ప్యాసింజర్లు పొడవాటి క్యూలైన్లు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి వైరల్గా మారడంతో నెటిజన్లు ఎయిరిండియాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మద్యం దుకాణం బంద్ చేస్తారా, లేదా మమ్మల్నే తాగమంటారా ! హర్యానా మహిళల వినూత్న నిరసన
ఇదిలా ఉంటే శనివారం ఎయిరిండియా ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఐదు గంటల పాటు మొరాయించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడవకముందే మరోసారి సాంకేతిక సమస్య తలెత్తడంపై ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఎయిర్పోర్టులో ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై మండిపడుతున్నారు.