మోడీ ప్రసంగం తగ్గించారా?: నెహ్రూ-మన్మోహన్ ఎవరెంతసేపు మాట్లాడారంటే?
ప్రధాని నరేంద్ర మోడీ 71వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన తన ప్రసంగాన్ని తొందరగానే ముగించారు. ఎర్రకోటపై గత ప్రసంగాల కంటే కూడా ఈసారి చాలా తక్కువ సమయాన్ని వినియోగించుకోవడం గమనార్హం.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 71వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన తన ప్రసంగాన్ని తొందరగానే ముగించారు. ఎర్రకోటపై గత ప్రసంగాల కంటే కూడా ఈసారి చాలా తక్కువ సమయాన్ని వినియోగించుకోవడం గమనార్హం. ఆగస్టు మన్ కీ బాత్ సందర్భంగానే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని 50 నిమిషాల్లోనే ముగిస్తానని మోడీ చెప్పారు.
తగ్గిన ప్రసంగం
చెప్పినట్లుగానే మోడీ తన ప్రసంగాన్ని తొందరగా ముగించేశారు. చెప్పిన సమయానికన్నా 4నిమిషాలు ఎక్కువ అంటే 54 నిమిషాల పాటు మోడీ ప్రసంగించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఎర్రకోటపై అతి తక్కువ సమయం ప్రసంగించిన సందర్భం ఇదే.
Recommended Video
గతంలో ఇలా..
గత సంవత్సరం అత్యధికంగా 94 నిమిషాల పాటు మాట్లాడిన మోడీ.. 2015లో 86 నిమిషాలు, 2014లో 65 నిమిషాల సేపు ప్రధాని ప్రసంగించారు. ఈసారి కూడా ప్రతి ఏడాదిలాగే తన ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరగా.. 8 వేలకుపైగా సూచనలు వచ్చాయి.
75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే 2022కల్లా కొత్త భారతదేశం కోసం కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక మిగితా ప్రధానుల ప్రసంగాలను గమనించినట్లయితే..
మన్మోహన్ సింగ్ 2005లో 50నిమిషాలు.. అటల్ బీహార్ వాజ్పాయి 2002లో 30నిమిషాలు.. జవహర్ లాల్ నెహ్రూ 1947లో 72నిమిషాలపాటు తమ ప్రసంగాన్ని కొనసాగించారు.
కొత్త సంకల్పంతో ముందుకు..
‘రాముడు, కృష్ణుడు ఆదర్శ పురుషులు. ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తాడు. పరిపానల అంటే ఇలా ఉండాలి అని రాముడు ఆచరించి చూపాడు. 125 కోట్ల మంది భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలం. 21వ శతాబ్దంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తోంది. ఈ శతాబ్దిలో జన్మించిన యువత మొదటిసారి ఓటుహక్కు సాధించుకోబోతోంది. దేశ ప్రగతిని కొత్త దిశగా నడిపించే అవకాశం యువతకు వస్తోంది. దేశ యువత నిరాశ నిస్పృహలను వీడి ముందుకు నడవాలి. కొత్త సంకల్పంతో దూసుకుపోవాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు.
నిజాయితీ పరులదే..
దేశం నిజాయతీపరులదని, ఇందులో అక్రమార్కులకు చోటు లేదని మోడీ స్పష్టం చేశారు. బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చి రూ.800కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సముద్రం, సరిహద్దు, సైబర్.. ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదన్నారు. దేశంలోని నలుమూలలకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయని, ఇంటింటికీ గ్యాస్ పొయ్యిల ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కలిగించామన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకుందని తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఓఆర్ఓపీని అమల్లోకి తెచ్చామని, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంలో కలిసి అక్కడి ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, కాశ్మీర్ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సమస్యలు ఆరోపణలు, తుపాకులతో పరిష్కారం కావని, ప్రజలు ఒకరికొకరు మమేకమైనప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలంతా భుజం భుజం కలిపినప్పుడే శత్రువును సమర్థంగా ఎదుర్కోగలమని మోడీ అన్నారు.
అభివృద్ధిలో వేగం
‘దేశంలో వేగవంతమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నాం. 9 నెలల్లో శుక్రగ్రహానికి చేరినవాళ్లం.. 70 కిలోమీటర్ల రైల్వేలైన్ వేయడానికి 42ఏళ్లు పట్టింది. ఇలాంటి పరిస్థితులు మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించి వేగవంతమైన అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రాలకు జవసత్వాలు చేకూర్చాం. అప్పుల్లో ముగిని ఉన్న విద్యుత్ ఉత్పాదక సంస్థలకు కొత్త వూపిరి అందించాం. అభివృద్ధి పథంలో ముందుకెళ్దామంటే ప్రజలెప్పుడూ వెనకడుగు వేయరు' అని మోడీ స్పష్టం చేశారు. ‘రైతులకు సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారు. ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా రైతులకు సాగు నీరందించే కార్యక్రమం వేగవంతం చేస్తున్నాం. మార్కెట్ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు కొత్త విధానాలతో ముందుకొస్తున్నాం నష్టాల్లో ఉన్న అన్నదాతలను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాం. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నకు చేయి అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోంది. యువత ఆర్థిక సాయంమందిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూడరు.. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది యువత కొత్త ఉద్యోగాలు సృష్టించారు' అని మోడీ వివరించారు.