ఒబామా ఎదురుచూస్తున్నారు: మోడీతో జాన్ కెర్రీ
న్యూఢిల్లీ: భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త బాటలో సాగేందుకు వీలుగా కొత్త అజెండాను రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. వచ్చే సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీతో శిఖరాగ్ర సమావేశం కోసం బరాక్ ఒబామా ఎదురు చూస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, వాణిజ్య మంత్రి ప్రిట్జ్కర్లు అన్నారు.
శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశం సందర్భంగా వారు ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశారు. దూరదృష్టి, వ్యూహం, కార్యాచరణల ఆధారంగా ఇరు దేశాల సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో ఖచ్చితమైన ఫలితాలు సాధించేందుకు ఇరుపక్షాలు సిద్ధంగా ఉండాలని వారు ప్రధానికి తెలియజేశారు.
ఒబామాతో తొలిసారిగా శిఖరాగ్ర చర్చలు జరపడం కోసం మోడీ సెప్టెంబర్ చివరివారంలో వాషింగ్టన్ వెళ్లనున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం జరిగిన భారత్- అమెరికా వ్యూహాత్మక చర్చల వివరాలను దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో ఇద్దరు మంత్రులు ప్రధాని మోడీకి వివరించారు.
ద్వైపాక్షిక సహకారంతోపాటు అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ భారత్తో సంబంధాలకు ఒబామా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వారు చెప్పారు. ఇరు దేశాల మైత్రిని కొత్తబాటలో నడిపించడానికి అవసరమైన కొత్త అజెండాను నిర్ణయించడానికి సెప్టెంబర్లో నిర్ణయాత్మక, ఫలప్రదమైన సమావేశం కోసం ఎదురు చూస్తున్నారని వారు మోడీకి తెలియజేసినట్టు పిఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది.