క్విడ్ ప్రో కో?: చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్లపై లుకౌట్ నోటీసులు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్లపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు దేశం విడిచి వెళ్లిపోకుండా నిలువరించడానికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తారన్న సంగతి తెలిసిందే.
కాగా, వీడియో కాన్ సంస్థకు రూ.3250కోట్ల రుణం మంజూరు చేయడంలో.. ఆ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ 'క్విడ్ ప్రో కో' పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీడియోకాన్కు రుణాలు ఇచ్చినందుకు గాను ఆమె వ్యక్తిగత లబ్ది పొందినట్టుగా బలమైన ఆరోపణలున్నాయి.
సీబీఐ విచారణ పూర్తయ్యేవరకు దీపక్ కొచ్చర్, ధూత్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండేందుకే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్ను గురువారం ముంబై విమానశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆగ్రేయాసియాకు వెళ్లిపోయేందుకే అతను విమానశ్రయానికి వచ్చినట్టు గుర్తించారు. సీబీఐ అధికారులు రాజీవ్ కొచ్చర్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినందువల్లే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీడియోకాన్ సంస్థకు లబ్ది చేకూర్చడం వెనుక రాజీవ్ హస్తంపై ప్రస్తుతం సీబీఐ ఆరా తీస్తోంది.
కాగా, వీడియోకాన్ సంస్థకు 20 బ్యాంకుల కన్సార్షియం రూ.40 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో 85శాతం మొండి బకాయిగానే మిగిలిపోయింది. అయినప్పటికీ వీడియోకాన్ సంస్థను దివాళా కంపెనీగా పేర్కొనకపోవడం గమనార్హం. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.