లూటీ, పరారీ.. ఇదీ మోడీ ప్రభుత్వం: కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: నీరవ్ మోడీ పరారీ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై పిఎంవోకు 2016 జులై 26వ తేదీననే ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు మండిపడింది. పిఎంవో గానీ ఇతర సంస్థలు గానీ చర్యలు తీసుకోలేదని, దీంతో నిందితుడు పారిపోయాడని కాంగ్రెసు నాయకులు అన్నారు.
లలిత్ మోీ, విజయ్ మాల్యా పరారీ తర్వాత మరో మోడీ స్కామ్ బ్యాంకింగ్ రంగాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టిందని కాంగ్రెసు వ్యాఖ్యానించింది. తొలుత లలిత్ మోడీ భారత్ నుంచి పారిపోయాడని, ఆ తర్వాత విజయ్ మాల్యా పారిపోయాడని, ఎబిజికి చెందిన రిషి అగర్వాల్ పారిపోయాడని, ఇప్పుడు నీరవ్ మోడీ పారిపోయినట్లు చెబుతున్నారని కాంగ్రెసు నాయకులు అంటూ మోడీ ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధించారు
పిఎన్బీ భారతదేశంలో జరిగిన అతి పెద్ద బ్యాంక్ లూటీ కుంభకోణమని అన్నారు. దాదాపు 30 బ్యాంకులకు సంబంధించిన వ్యవహారమని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాాద్ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన కుంభకోణమని అన్నారు.
మోడీ ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ రంగానికి చెందిన రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్రాడ్ డిటెక్షన్ ఎబిలిటీ, రెగ్యులేటరీ మెకానిజం పూర్తిగా నిస్సవత్తువగా మారాయని వారన్నారు.
పిఎన్బీ ఈ ఏడాది జనవరి 29వ తేదీన సిబిఐకి చేసిన ఫిర్యాదును బట్టి 2017 ఫిబ్రవరి 9, 14వ తేదీల మధ్య కోట్లాది రూపాయల విలువ చేసే ఎల్ఓసీలను ఇచ్చిన తీరును వెల్లడిస్తోందని వారన్నారు. నష్టం 11,400 కోట్ల రూపాయలు ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2017 ఫిబ్రవరి 14వ తేదీన సెబీకి తెలియజేసిందని చెప్పారు. శ్రీ మెహుల్ చోక్సీ ప్రమోట్ చేసిన గీతాంజలి జెమ్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ.9,872 కోట్ల రూపాయల వ్యవహారం నడిపిందని, మొత్తం ప్రక్రియను దాటేశారని, మొత్తం నియంత్రణ వ్యవస్థలను దాటుకుని వెళ్లారని, ప్రతి విషయంలోనూ ఆడిటర్స్, దర్యాప్తు అధికారుల కళ్లు గప్పారని, రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ డిటెక్షన్ ఎబిలిటీ పని చేయలేదని, అయినప్పటికీ ఇద్దరు ఉద్యోగులు ఈ మొత్తం కుంభకోణాన్ని నడిపించారని మోడ ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెసు నాయకులు అన్నారు.
ఈ మొత్తం వ్యవహారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసునని, హరిప్రసాద్ అనే వ్యక్తి 2016 జులై 26వ తేదీన పిఎంవోకు ఫిర్యాదు చేశారని, దాన్ని స్వీకరించినట్లు పిఎంవో కూడా ధృవీకరించిందని, హరిప్రసాద్ ఫిర్యాదు ద్వారా ప్రధానికి ఆ విషయం తెలిసిందని అన్నారు.
అవన్నీ జరిగినప్పటికీ నీరవ్ మోడీ ప్రధానితో పాటు 2018 జనవరిలో దావోస్ వాణిజ్య బృందంతో పాటు ప్రయాణించారని అన్నారు. కాంగ్రెసు ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు వేసి వాటికి సమాధానం కావాలని డిమాండ్ చేసింది. అవి...
1. మోడీ ప్రభుత్వం హయాంలో నీరవ్ మోడీ/ మెహుల్ చోక్సీ ఫోర్జ్ చేసిన అవగాహన లేఖల ద్వారా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కళ్లు ఎలా కప్పారు? ఈ అతి పెద్ద బ్యాంక్ లూటీ కుంభకోణానికి బాధ్యులెవరు?
2. రాతపూర్వకమైన ఫిర్యాదును 2016 జులై 26వ తేదీన అందుకున్నప్పటికీ బ్యాంకింగ్ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆర్థిక మంత్రిత్వ శాఖ, దాని ఆర్థిక నిఘా విభాగం, ఇతర అధికారిక సంస్థలు తమ పనులు చేయకుండా ఎందుకు నిద్రపోయాయి?
3. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోకుండా లుకవుట్ నోటీసులు జారీ చేయాలని 2018 జనవరి 29వ తేదీన పిఎన్బీ జోనల్ కార్యాలయం డిజిఎం సిబిఐని కోరుతూ సిబిఐ జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు. ఇన్ని జరిగినప్పటికీ చట్టాన్ని తప్పించుకుని దేశం విడిచి పారిపోవడానికి నీరవ్ మోడీకి అనుమతి ఎలా లభించింది?
4. మొత్తం సిస్టమ్ను ఎలా బైపాస్ చేశారు? ఈ ఫ్రాడ్ ఆడిటర్లు, ఇన్వెస్టిగేటర్ల కళ్లు గప్పింది? ఉన్నత స్థాయిలో చురుకైన పాత్ర ఉన్నదనే విషయానికి నిదర్శనం కాదా? నీరవ్ మోడీ/మెహుల్ చోక్సీని ఎవరు రక్షిస్తున్నారు?
5. మొత్తం బ్యాంకింగ్ రంగం రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్రాడ్ డిటెక్షన్ ఎబిలిటీ ఏ విధంగా జీరో అయింది.