ఆ ఇద్దరి కోసం జనాన్ని లూటీ చేస్తున్నారు.. సిలిండర్ ధరల విషయంలో కేంద్రంపై రాహుల్ ఫైర్...
ఓవైపు రూ.100కి దగ్గరలో పెట్రోల్ ధరలు... మరోవైపు రూ.1000 దిశగా ఎల్పీజీ సిలిండర్ ధరలు... ఇక నిత్యావసర వస్తువుల ధరలు సరేసరి... దీంతో సామాన్య జనం ఎట్లా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ప్రభుత్వం ఇలా ఎడాపెడా ధరలు పెంచేసుకుంటూ పోతే ఎలా అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం జనాలను దోచుకుంటూ ఆ ఇద్దరి అభివృద్దికి సహకరిస్తోందని రాహుల్ విమర్శించారు. బడా కార్పోరేట్ యజమానులు అంబానీ,ఆదానీలను ఆ ఇద్దరు అంటూ పరోక్షంగా టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నినాదం 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాదని... జనతా సే లూట్,సిర్ఫ్ దో కా వికాస్' అని ఎద్దేవా చేశారు.
ఇటీవల లోక్సభలోనూ 'హమ్ దో హమారే దో సర్కార్..(మేమిద్దరం... మాకిద్దరం..)' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని,అంబానీ ఆదానీలను రాహుల్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన రాహుల్... కేంద్రం మండీ వ్యవస్థను నాశనం చేసి కొంతమంది కార్పోరేట్లకు మేలు చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేకించి ఎవరి పేర్లను రాహుల్ పేర్కొననప్పటికీ... ఆ ఇద్దరూ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంబానీ,ఆదానీలను ఉద్దేశించినవే అన్నది అందరికీ తెలిసిందే.
కాగా,తాజాగా ఎల్పీజీ వంటగ్యాసు ధరలను సిలిండర్కు రూ. 50 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలతో తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 821.50కు చేరింది. గడిచిన మూడు నెలల్లో సిలిండర్ ధర ఏకంగా రూ.200 పెరిగింది. 2020 డిసెంబర్లో రెండు దఫాలుగా రూ.100 చొప్పున, 2021 జనవరిలో మరో రూ.25, ఫిబ్రవరి నెలలో రెండు దఫాలుగా రూ.75 చొప్పున సిలిండర్ ధరలు పెరిగాయి.ఇప్పటికే పెట్రో ధరల పెంపుతో సగం జీతం బండికే తగిలెయ్యాల్సిన పరిస్థితని జనం వాపోతుంటే... ఇలా సిలిండర్ ధరలు కూడా రోజురోజుకు పెంచుకుంటూ పోవడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు కొన్నేళ్లుగా ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు వంట గ్యాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. గ్యాస్ ధరలను కూడా ఏ రోజుకారోజు సమీక్షించి ధరలను పెంచేందుకు చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. దశలవారీగా 15 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి ధరలు పెంచాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి గ్యాస్ ధర పెంచుతున్నట్లు చమురు సంస్థల డీలర్లకు ఆదివారం(ఫిబ్రవరి 14,2021) రాత్రి సమాచారం అందింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇకపై ప్రతీ వారం లేదా 15 రోజులకు వంట గ్యాస్ సిలిండర్పై కూడా బాదుడు తప్పదు.మరోవైపు వంట గ్యాస్ సబ్సిడీని కేంద్రం రూ.40కే తగ్గించిన సంగతి తెలిసిందే. అది కూడా కొంతమందికి మాత్రమే అందుతోంది. భవిష్యత్తులో మొత్తం సబ్సిడీనే ఎత్తేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.