మేము ఆ పని చేస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు: సుప్రీం చీఫ్ జస్టిస్: రథయాత్రకు బ్రేక్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథోత్సవానికి ఈ ఏడాది బ్రేక్ పడింది. జగన్నాథుడి రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ మహోత్సవం రద్దయింది. పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని నిర్వహించవద్దంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రథోత్సవం నిర్వహణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23వ తేదీన జగన్నాథుడి రథయాత్రను నిర్వహించాల్సి ఉంది. జగన్నాథుడు.. బలభద్ర, సుభద్రలతో కలిసి కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఊరేగింపుగా బయలుదేరాల్సి ఉంది ఆ రోజే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇదివరకే చేపట్టింది పూరీ ఆలయ కమిటీ.
ఒకవంక ఉత్సవాన్ని యధాప్రకారం నిర్వహించడానికి సన్నాహాలు కొనసాగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. కరోనా వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రథోత్సవాన్ని నిర్వహించడం మంచిది కాదని, దీనిపై స్టే ఇవ్వాలని కోరుతూ కొద్దిరోజుల కిందట సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒడిశా వికాస్ పరిషత్ ఈ పిటీషన్ను దాఖలు చేసింది. ఒడిశా ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటీషన్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒడిశా వికాస్ పరిషత్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఒడిశా ప్రభుత్వం తరఫున హరీష్ సాల్వే తమ వాదనలను వినిపించారు. జగన్నాథుడి రథయాత్రకు దేశ, విదేశాల నుంచి 10 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని లక్షల మంది భక్తులు ఒకేచోట గుమికూడే పరిస్థితి రావడం సరికాదని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు.
Recommended Video
ఈ సందర్భంగా ధర్మాసనం.. హరీష్ సాల్వే అభిప్రాయాన్ని కోరగా రద్దు చేయడమే మంచిదని అన్నారు. దీనితో జగన్నాథుడి రథయాత్రను నిర్వహించడానికి స్టే ఇస్తున్నట్లు ఎస్ఏ బొబ్డె తీర్పు ఇచ్చారు. రథయాత్రను నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం అంటూ జరిగితే.. ఆ జగన్నాథుడు తమను ఎప్పటికీ క్షమించడని బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. 284 సంవత్సరాల తరువాత తొలిసారిగా పూరీ జగన్నాథుడి రథోత్సవానికి బ్రేక్ పడటం ఇదే తొలిసారి.