శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ: మరో వివాదానికి తెరలేపిన ప్రధాని కేపీ శర్మ ఓలి
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: చైనా అండ చూసుకుని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి దుందుడుకు చర్యలకుదిగుతున్నారు. ఇప్పటికే సరిహద్దు భారత భూభాగాల(లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా)ను తమ దేశ అధికార మ్యాప్లో ప్రదర్శించిన ఓలి.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అంతేగాక, భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ
తాజాగా, సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి. భారత ప్రజలకు ఆరాధ్యుడైన అయోధ్య శ్రీరాముడు తమవాడేనంటూ వ్యాఖ్యానించారు. శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ అంటూ పేర్కొన్నారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందంటూ చెప్పుకొచ్చారు.
నిజమైన అయోధ్య నేపాల్లోనే ఉంది..
‘భారతదేశంలో ఉన్న అయోధ్య అసలుది కాదు. నిజమైన అయోధ్య నేపాల్లోని థోరీలో ఉంది. శ్రీరాముడు భారతీయుడు కాదు, నేపాలీ. రాముడి జన్మభూమి తమదని చెప్పుకుంటూ భారత్ సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోంది' అంటూ నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తమ అయోధ్యకు ఎలాంటి వివాదం లేదంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
చైనా అండతో రెచ్చిపోతున్న కేపీ శర్మ ఓలి..
చైనా అండతో నేపాల్ ప్రధాని ఓలి గత కాలంగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోద ముద్ర వేసింది ఓలి ప్రభుత్వం. అంతేగాక, తమ దేశంలో భారత్ కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని, చైనా కంటే భారతదేశంలోని కరోనానే ప్రమాదకారి అంటూ చిందులు తొక్కారు కూడా.
ఓలి రాజీనామాకు సొంత పార్టీ నేతల డిమాండ్..
తాజాగా, భారతదేశానికి చెందిన వార్త ఛానెళ్లను కూడా ప్రధాని ఓలి నేపాల్లో నిషేధించారు. ఓ వైపు నేపాల్ సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నప్పటికీ.. ప్రధాని ఓలి భారతదేశంపై అక్కసు వెల్లగక్కడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓలి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టిన సొంత పార్టీ కీలక నేత ప్రచండ.. ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు పలువురు నేతలు కూడా ఓలి పదవి నుంచి దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రధాని ఓలి.. శ్రీరాముడి అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఓలి శ్రీరాముడి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
కాగా, భారతదేశంలోని కమ్యూనిస్టులు ఎప్పుడూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉంటారని, ఇప్పుడు నేపాలీ కమ్యూనిస్టులు కూడా ఆ కోవలోకి చేరిపోయారని బీజేపీ మండిపడింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడినా సహించేది లేదని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ శంకర్ శాస్త్రి అన్నారు. అది ప్రధాని ఓలి అయినా కూడా సహించబోమని స్పష్టం చేశారు. భారత్లోలానే నేపాలీ కమ్యూనిస్టులు కూడా ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నారని అన్నారు.