శివుడు కులం ఏంటో తెలుసా.. ఈ మంత్రి ఆధారాలతో సహా చెప్పాడు
బీహార్ : ఇప్పటివరకు కులజాఢ్యం ఒక్క మనుషులకే పరిమితమైందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కుల కంపును దేవుళ్లకు కూడా అంటించేస్తున్నారు కొందరు నాయకులు. ఫలానా దేవుడు మా కులం వాడంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా బీహార్ మాజీ మంత్రి భగవంతుడికి కులం రంగు అద్దారు.
బీహార్ మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివుడు తమ కులంకు చెందిన వాడంటూ వ్యాఖ్యానించారు. శివుడు బింద్ కులంకు చెందిన దేవుడని చెప్పారు. అంతేకాదు హిందీలో రాసి ఉన్న కొన్ని వాక్యాలను రుజువుగా పొందుపర్చారు. కృష్ణ పరమాత్ముడు యాదవ కులంకు చెందిన వాడైతే, శ్రీరాముడు క్షత్రియ కులంకు చెందిన వాడు అయినప్పుడు శివుడు బింద్ కులంకు ఎందుకు చెంది ఉండకూడదని ప్రశ్నించారు. మన చరిత్ర చాలా పురాతనమైనదని చెప్పిన మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్... శివ పురాణంలో శివుడి యొక్క కులం గురించి ప్రస్తావించారని చెప్పారు. శివుడు బింద్ కులంకు చెందిన వాడని అందులో స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు.
ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొత్తం బీహార్ జనాభాలో కేవలం 2శాతం ఉన్న ఓ కులానికి చెందిన వారు 14శాతం ఉన్న మరో కులం వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. నోనియా -బింద్- బేల్దార్ మహాసంఘ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, ఆరోగ్యశాఖ మంత్రి మంగల్ పాండేలు కూడా పాల్గొన్నారు. గతేడాది ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా భగవంతుడికి కులం అంటగట్టి విమర్శలపాలయ్యారు. హనుమంతుడు దళితుడంటూ వ్యాఖ్యానించారు. యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన రాజస్థాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు జారీ చేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు హనుమంతుడికి కులం అంటగట్టారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.