శంషాబాద్లో సంచలనం: లారీ నిండా నోట్ల కట్టలే.. ఎవరివి? ఎక్కడివి?
శంషాబాద్ లో భారీ నోట్ల కట్టలతో వెళ్తున్న ఓ లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ : శంషాబాద్ లో నోట్ల కట్టలతో వెళుతున్న ఓ లారీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఓవైపు నగదు దొరక్క సామాన్య జనం అల్లాడుతుంటే.. బడాబాబుల వద్ద కోట్ల కొద్ది కొత్త నోట్లు బయటపడుతుండటం.. బ్లాక్ ను వైట్ చేసుకునేందుకు నల్లకుబేరులు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగుచూస్తుండటం సామాన్యుడిని కలవరపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. శంషాబాద్ లో భారీ నోట్ల కట్టలతో వెళ్తున్న ఓ లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో.. నోట్ల కట్టలతో వెళ్తున్న వాహనం పోలీసులు కంటపడింది. లారీలో ఏముందని తొలుత డ్రైవర్ ను ప్రశ్నించగా.. అతని పొంతన లేని సమాధానాలు విని పోలీసులకు అనుమానం కలిగింది.
దీంతో లారీలో సోదా చేయగా.. భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. అనంతరం లారీతో పాటు లారీని అనుసరిస్తున్న ఓ జీపును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, అధికారికంగా దీనిపై ఇంతవరకు పోలీసులెవరు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాగా, లారీలో ఉన్న నోట్లు కొత్తవా..? పాతవా..? అసలెక్కడి నుంచి వీటిని తీసుకువస్తున్నారు? అన్న విషయం తెలియరాలేదు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.