నష్టం తగ్గించాం: నిర్మల, తుఫానుపై కేంద్రానికి బాబు లేఖ
న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలతో హుధుద్ తుపాను నష్టాన్ని నివారించగలిగామని కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలుగువారు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఆమె అనంతరం తుపాన్పై మీడియాతో మాట్లాడారు.
కేంద్రం నుంచి అవసరమైన మేరకు సహాయం అందిస్తామని అన్నారు. సహాయక చర్యలకు మరిన్ని బలగాలను పంపేందుకు సిద్ధమని నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. తెలుగు ప్రజలు క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. తుపాను ప్రభావం నుంచి ప్రజలను కాపాడ్డం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని నిర్మాలా సీతారామన్ తెలిపారు.
ఒడిషా రాష్ట్రం కూడా అక్కడ ప్రజలను కాపాడ్డానికి తగిన చర్యలు తీసుకుందని ఆమె చెప్పారు. ముందు జాగ్రర్త చర్యల వల్ల అనుకున్న దానికంటే కొంచెం తక్కువే నష్టం కలిగినట్లు ఆమె అభిప్రాయడ్డారు. ఇప్పుడే నష్టంపై అంచనా వేయలేమని ఆమె అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖజిల్లాలో రెండు రోజులు ఉండి తుపాన్ పరిస్థితిని సమీక్షిస్తారని బాబు చెప్పిన విషయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.
హుధుద్ తుపాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణ సాయం కింద రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారని ఆయన అన్నారు. హుద్హుద్ తుపాన్పై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోం మంత్రి రాజ్నాథ్ సింగ్లు పలుమార్లు ఫోన్ చేసి తుపాన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని పరకాల వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నానికి ఏపీ మంత్రులంతా విశాఖలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారని, డీజీపీ నుంచి అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులు కూడా విశాఖలో ఉండాలని ఆదేశించారని, ఎంత రాత్రి అయినా చంద్రబాబు విశాఖ చేరుకుంటారని ఆయన తెలిపారు. అక్కడ పునరావాస, సహాయ కార్యక్రమాలు సీఎం దగ్గర ఉండి పర్యవేక్షిస్తారని, విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగిస్తారని పరకాల తెలిపారు.
హుధుద్ తుపాన్పై ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించినట్లు పరకాల తెలిపారు. తుపాన్ నష్టం వివరాలను వెబ్సైట్లో ఉంచుతామని ఆయన అన్నారు. తుపాన్ బీభత్సానికి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారని ఆయన చెప్పారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన అన్నారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా బాధితులకు సాయం అందించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పరకాల స్పష్టం చేశారు.