ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్
చెన్నై: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, ఇంజిన్ పని చేయకపోవడంతో అత్యవసరంగా తిరిగి చెన్నైలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది.
విమానం ఆకాశంలో ఉండగానే ఎయిర్ బస్ ఏ320 విమానం ఇంజిన్ పని చేయలేదని, పొగలు కక్కుతూ పెద్ద శబ్దంతో విమానం ఊగిపోయిందని తెలుస్తోంది. ఇంజిన్ బ్లేడ్లు చెడిపోవడంతో తిరిగి విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై మంగళవారం సమీక్షించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. అయితే, ఇండిగో మాత్రం దీనిని ఖండించింది. ఇంజిన్ సమస్య లేదా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాలేదని తన ప్రకటనలో తెలిపింది.
అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ ఎ320 విమానంలో వినియోగిస్తున్న కొత్తరకం ఇంజిన్లను ప్రాట్ అండ్ విట్నీ అనే కంపెనీ తయారు చేస్తోంది. 2016 నుంచి వీటిని ఇండిగో వినియోగిస్తోంది. ఈ ఇంజిన్లను ఉపయోగిస్తున్న విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి.