విమానాల్లో బాంబులు పెట్టానంటూ ఫోన్: టెక్కీ అరెస్ట్
న్యూఢిల్లీ/బెంగళూరు: మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ తప్పుడు ఫోన్ కాల్ చేసిన కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్(టెక్కీ)ని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పుడు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి.
ఈ బెదిరింపు కాల్ వల్ల శనివారం అప్పటికే టేకాఫ్ తీసుకుని గగనతలంలోని వెళ్లిపోయిన జెట్ ఎయిర్వేస్, కెథే పసిఫిక్లకు చెందిన రెండు విమానాల్ని వెనక్కి రప్పించారు.
అలాగే టేకాఫ్కు సిద్ధంగా ఉన్న మరో స్విస్ ఎయిర్కు చెందిన విమానాన్ని సైతం నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. వాటిల్లో ఎలాంటి బాంబూ దొరకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇందువల్ల అవి ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి. వీటి ప్రభావం వల్ల మరికొన్ని ఫ్త్లెట్లు సైతం ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇది ఇలా ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు తన భార్యను హత్య చేసినట్లు చెబుతున్నాడు.
గత జులై నెలలో తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు గోకుల్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిందితుడు చెప్పిన వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.