లవ్ జీహాద్ వాస్తవమే: క్రిస్టియన్ అమ్మాయిలే ఐసిస్ టార్గెట్
కేరళ: వివిధ మత ప్రచారాలపై గట్టి హెచ్చరికలు చేస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేరళలోని ప్రధాన చర్చి లవ్ జీహాద్పై ఓ సంచలన ప్రకటన చేసింది. కేరళ రాష్ట్రంలో లవ్ జీహాద్ అనేది వాస్తవమే అని చెప్పింది. క్రైస్తవ మతానికి చెందిన మహిళలను ముస్లిం మతంలోకి మార్చి ఆ తర్వాత వారిని ఐసిస్లో చేరుస్తున్నారని కేరళలో అతిపెద్ద క్రిస్టియన్ చర్చ్ అయిన సిరో మలబార్ క్యాథలిక్ చర్చ్ పేర్కొంది. క్రైస్తవ మహిళలు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నారని చర్చ్ ప్రతినిధులు తెలిపారు.
కేరళలో పెరిగిపోతున్న లవ్ జీహాద్
కేరళలో లవ్ జీహాద్ పెరిగిపోతోందని క్రైస్తవ మతాధికారి చెప్పారు. ఇది సెక్యులరిజంకు ప్రమాదకరంగా మారుతోందని వెల్లడించారు. అంతేకాదు సామాజికపరంగా ప్రశాంతంగా ఉన్న వర్గాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కొంతమంది క్రైస్తవ అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపి చంపేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే క్రైస్తవుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో తల్లిదండ్రులు పిల్లలకు లవ్ జీహాద్ ఉచ్చులో పడకూడదని చెబుతూ అవగాహన కల్పించారు.
క్రిస్టియన్ అమ్మాయిలే టార్గెట్గా...
లవ్ జీహాద్ కేరళకు ప్రమాదకరంగా మారిందని చెప్పారు మతాధికారి. ఇప్పటి వరకు 21 మంది క్రైస్తవులు ఐసిస్లో చేరారని చెప్పారు. ఇందులో సగం మందిని క్రైస్తవ మతం నుంచి ఇస్లాం మతంలోకి మార్చడం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనతో క్రైస్తవులకు కనువిప్పు కలగాలని మతాధికారి అన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ వ్యూహాలు రచిస్తోందని చెప్పారు. వారిని ఉచ్చులో బిగించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి మతమార్పిడికి పాల్పడుతున్నారని వెల్లడించింది. ఇలా జరుగుతోందని తెలిసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్రైస్తవ మతాధికారి చెప్పారు. దీన్ని మతపరమైన అంశంగా చూడకుండా.. లా అండ్ ఆర్డర్ సమస్యగా పరిగణించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవ మతాధికారి వ్యాఖ్యలపై ఇస్లాం సంస్థ ఆగ్రహం
ఇదిలా ఉంటే ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా క్రైస్తవ మతాధికారి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో క్రైస్తవ మతాధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చర్చి ఇచ్చిన ప్రకటను సంపూర్ణ మద్దతు తెలిపింది విశ్వహిందూ పరిషత్. కేరళలో లవ్ జీహాద్పై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చింది.
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న చర్చి
తాను ప్రేమించిన ఓ యువకుడు ఇస్లాం మతం స్వీకరించాల్సిందిగా బలవంతం చేస్తున్నాడని, అదే సమయంలో లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడని చెబుతూ ఓ యువతి తన ఆవేదన బయటపెట్టడంతో చర్చి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే చర్చి పలు చోట్ల క్రైస్తవ అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జీహాదీల ట్రాప్లో పడకూడదంటూ హిత బోధ చేస్తోంది.