రాత్రంతా లాకప్లో కొత్త జంట.. 'లవ్ జిహాద్' ఆరోపణలతో పోలీసుల టార్చర్.. చివరకు తేలిందేంటంటే...
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 'లవ్ జిహాద్' పేరుతో ఓ జంటను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అలా పెళ్లి జరిగిందో లేదో వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. వరుడిని లాకప్లో పెట్టి బెల్ట్తో చితకబాదారు. చివరకు ఆ జంట ఇద్దరు ముస్లింలే అని తేలడంతో ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని నిజమో కాదో ధ్రువీకరించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది...
ఖుషీనగర్లోని ఓ కాలనీలో మంగళవారం(డిసెంబర్ 8) సాయంత్రం హైదర్ అలీ-షబీనా వివాహం జరిగింది. స్నేహితులు,కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇంతలో ఎవరో ఈ పెళ్లి గురించి పోలీసులకు ఫోన్ చేశారు. ఓ ముస్లిం వ్యక్తి హిందూ యువతిని మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటున్నాడని పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సాయంత్రం 7.30గం. సమయంలో నేరుగా వివాహం జరుగుతున్న చోటుకు వెళ్లారు. ఆ జంట చెప్తున్నదేమీ వినిపించుకోకుండా ఇద్దరిని పోలీస్ జీప్ ఎక్కించి స్టేషన్కు తరలించారు.
బెల్టుతో చితకబాదిన పోలీసులు...
పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాక ఇద్దరినీ వేర్వేరు లాకప్స్లో పెట్టారు. హైదర్ అలీని పోలీసులు బెల్టుతో చితకబాదారు. తనకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని అలీ వాపోయాడు. తనను పోలీసులు కొడుతుంటే తన భార్య షబీనా ఏడ్చిందని... తీవ్ర భయాందోళనకు గురైందని చెప్పాడు. పోలీసులకు భయపడి ఆమె నోరు తెరవలేదని.. రాత్రి 9గంటల సమయంలో పోలీసులకు ఆమె తన సోదరుడి ఫోన్ నంబర్ ఇచ్చిందని తెలిపాడు.
రాత్రంతా లాకప్లోనే కొత్త జంట..
పోలీసులు ఆమె సోదరుడికి ఫోన్ చేయగా... ఆమె ఆధార్ కార్డును అతను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత వీడియో కాల్ కూడా చేసి ఆమె ముస్లిం అమ్మాయే అని చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు వారిని విడిచిపెట్టలేదు. ఆమె సోదరుడు పోలీస్ స్టేషన్కు వచ్చాకే ఇద్దరినీ పంపిస్తామని చెప్పారు. దీంతో ఖుషీనగర్కు 130కి.మీ దూరంలోని అజంఘర్ నుంచి ఆమె సోదరుడు వచ్చేంతవరకు రాత్రంతా ఇద్దరినీ లాకప్లోనే ఉంచారు. ఎట్టకేలకు ఆమె సోదరుడు అక్కడికి చేరుకుని షబీనా తన సోదరి అని,ఆమె ముస్లిం అమ్మాయేనని మరోసారి పోలీసులకు వివరించాడు. ఈ క్రమంలో షబీనా తన సోదరుడితో ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. తాను అలీని వివాహం చేసుకున్నానని... అతనితోనే ఉంటానని చెప్పింది. అందుకు ఆమె సోదరుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. తన సోదరి ఇష్టమే తమ కుటుంబ ఇష్టమని చెప్పాడు. అప్పుడు గానీ పోలీసులు వారిని విడిచిపెట్టలేదు.
పరస్పర అంగీకారంతోనే...
ఖుషీనగర్కు చెందిన అర్మన్ ఖాన్ అనే సామాజిక కార్యకర్త ఈ ఘటనపై మాట్లాడుతూ... హైదర్ అలీ,షబీనాకు ఏడాదిన్నరగా పరిచయం ఉందన్నారు. కొన్నేళ్ల క్రితం హైదర్ అలీ భార్య చనిపోయిందని... అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నాడని చెప్పారు. అజంఘర్కి చెందిన షబీనా ఇటీవలే ఇల్లు వదిలి అలీ కోసం ఖుషీనగర్కు వచ్చిందని తెలిపారు. అలీ-షబీనా పరస్పర అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని... ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తమను సంప్రదించి నిఖా జరిపించాలని కోరారని చెప్పారు.
Recommended Video
హిందూ వాహిని కార్యకర్తల పనే..?
వారి కోరిక మేరకు వివాహం జరిపించామని... అయితే కొంతమంది హిందూ వాహిని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. స్థానిక వాచ్మెన్ ముష్తకీమ్ అలీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. కొంతమంది హిందూ యువత పోలీసులకు ఫోన్ చేసి లవ్ జిహాద్ జరుగుతున్నట్లు సమాచారం ఇచ్చారని ఆరోపించాడు. వారి సమాచారంతోనే పోలీసులు రంగంలోకి దిగి ఇలా చేశారని తెలిపాడు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.