"లవ్ జిహాద్"పదం కనిపెట్టిందే బీజేపీ- దేశ విభజనే దాని లక్ష్యం- అశోక్ గెహ్లాట్ ఫైర్
దేశవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న "లవ్ జిహాద్" ఘటనలపై బీజేపీ కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. లవ్ జిహాద్ పేరుతో వేలాది మంది యువతులు ట్రాప్కు గురయ్యారని తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. రాజస్ధాన్కు చెందిన షెకావత్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు.
దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చేందుకు అక్కడి సీఎంలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నేతలు లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలను తీసుకురాగా.. మిగతా రాష్ట్రాల్లోనూ అదే వ్యూహం త్వరలో అమలు చేయబోతున్నారు. దీంతో లవ్ జిహాద్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుబట్టారు. అసలు లవ్ జిహాద్ అనే పదాన్ని కనిపెట్టిందే బీజేపీ అని, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి, దాన్ని సాకుగా చూపుతూ దేశాన్ని విభజించాలనేది బీజేపీ వ్యూహమని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
Recommended Video
బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే హక్కును కాలరాస్తోందని అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో యువజనులను కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. పెళ్లి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దాన్ని నియంత్రించేందుకు చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఏ న్యాయస్ధానంలోనూ ఈ వాదన నిలబడదని గెహ్లాట్ తెలిపారు. ప్రేమలో జిహాద్కు స్ధానం లేదన్నారు.