దళిత యువకుడితో యువతి ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఏం చేసిందంటే, అనామకుడి లేఖతో!
మైసూరు/బెంగళూరు: జాతి తక్కువ వాడిని ప్రేమించి కుటంబం పరువు తీసిందని కన్న కూతుర్ని తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సొంత పొలంలో కుమార్తె మృతదేహాన్ని కాల్చి బూడిద చేసిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్ డీ కోట తాలుకా గోల్లనబీడు గ్రామంలో జరిగింది. సుష్మా (21) అనే యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని మైసూరు జిల్లా ఏఎస్పీ రుద్రముని మీడియాకు చెప్పారు. అనామకుడి లేఖతో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
హైస్కూల్ ప్రేమ
గోల్లనబీడు గ్రామానికి చెందిన కుమార్ కుమార్తె సుష్మా హైస్కూల్ లో 10వ తరగతి చదివే సమయంలో ఆలనహళ్ళి గ్రామానికి చెందిన ఉమేష్ పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.
పెద్దలకు చెప్పారు
సుష్మా, ఉమేష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దలకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకోవాలని, వారి అనుమతితో అందరి ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. రెండు నెలల క్రితం సుష్మా, ఉమేష్ వారి కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పారు.
తక్కువ జాతి అల్లుడు
సుష్మాను వివాహం చేసుకోవడానికి ఉమేస్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే ఉమేష్ ను పెళ్లి చేసుకోవడానికి సుష్మా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఓ దళితుడిని ఇంటికి అల్లుడిగా తీసుకువస్తావా అంటూ సుష్మా తండ్రి కుమార్ రెచ్చిపోయాడు.
గుడిలో పెళ్లి
సుష్మా ఇంటి నుంచి పారిపోయి ఉమేష్ ను గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. సుష్మాకు ఫోన్ చేసిన ఆమె తండ్రి కుమార్ ఇంటికి తిరిగిరావాలని, మంచి ముహుర్తం చూసి అందరి ముందు పెళ్లి చేస్తామని నమ్మించారు. అయితే తాను ఉమేష్ దగ్గరే ఉంటానని, ఇంటికి తిరిగిరానని సుష్మా చెప్పింది.
సుష్మా ఫ్యామిలీ పక్కా ప్లాన్
ఇంటికి రావడానికి నిరాకరించిన సుష్మా ఇంటి దగ్గరకే కుటుంబ సభ్యులు వెళ్లారు. సుష్మాకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత తమ కుమార్తె సుష్మా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మరుసటి రోజు గ్రామస్తులను నమ్మించారు.
గుర్తు తెలియని వ్యక్తి
ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి సొంత పోలంలో సుష్మా మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి మైసూరు జిల్లా ఏఎస్పీ రుద్రముని కార్యాలయానికి లేఖ రాశాడు.
సుష్మా, ఉమేష్ లవ్ స్టోరి
సుష్మా దళిత యువకుడు ఉమేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, మళ్లీ ఆమెను బలవంతంగా ఇంటి తీసుకు వెళ్లారని, తరువాత సుష్మాకు బలవంతంగా విషం తాగించి హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారనే పూర్తి విషయాలు మొత్తం లేఖలో గుర్తు తెలియని వ్యక్తి వివరించాడు.
పోలీసులు ఎంట్రీ
ఏఎస్పీ రుద్రముని కేసు విచారణ చేపట్టారు. సుష్మా తండ్రి కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో కుమార్ చెప్పిన విషయాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. దళిత యువకుడిని ప్రేమించిన కుమార్తెను ఎంత దారుణంగా హత్య చేశారో తెలుసుకున్నారు.
కూల్ డ్రింక్ లో విషం
ఆరంజ్ కూల్ డ్రింక్ లో విషం కలిపిన కుమార్, అతని తమ్ముడు కెంప తదితరులు 21వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సుష్మాకు బలవంతంగా తాగించారు. శరీరంలోకి విషం చేరడంతో సుష్మా తల్లడిల్లిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేడకుంది. ఇంటిలోనే గిలగిల కొట్టుమిట్టాడుతూ మరుసటి రోజు వేకువ జామున 5 గంటల సమయంలో సుష్మా మరణించిందని పోలీసుల విచారణలో ఆమె తండ్రి కుమార్ అంగీకరించాడు.
సుమోటో కేసు
సుష్మాను హత్య చేసినట్లు ఆమె తండ్రి కుమార్ అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పరారైన సుష్మా తల్లి, చిన్నాన కెంప తదితరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖ ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.