నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్... రూ.కోటి డిమాండ్
నగ్న ఫోటోలను చూపెట్టి.. రూ.కోటి ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ ఓ యువతి తన ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి, చివరికి కటకటాల పాలయింది.
చెన్నై: ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన నగ్న ఫోటోలను చూపెట్టి.. రూ.కోటి ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ ఓ యువతి తన ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి, చివరికి కటకటాల పాలయింది.
వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన అర్చన(22) పరిచయమైంది.
రోజులు గడిచే కొద్దీ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్ కుమార్ నగ్నంగా ఉన్నప్పుడు అర్చన ఫోటోలు తీసింది. ఆ తరువాత వాటిని బయట పెడతానని బెదిరిస్తూ అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.
అంతటితో ఆగకుండా ప్రేమ్ కుమార్ తనపై అత్యాచారం జరిపాడని ఆరోపిస్తూ రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చి ప్రేమ్ కుమార్ నుంచి రూ.4 లక్షలు అర్చనకు ఇప్పించారు.
అయినా ఇంకా డబ్బు కావాలంటూ అర్చన బెదిరింపులకు దిగింది. రూ.కోటి ఇవ్వకపోతే అతడి నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరించింది. ఆమె బాధ పడలేక ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అర్చనను అరెస్టు చేశారు.