హర్యానాలో నువ్వా నేనా: తక్కువ పోలింగ్ శాతమే బీజేపీ కొంప ముంచిందా..?
న్యూఢిల్లీ: 2014లో హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవలీలగా మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన బీజేపీకి ఈసారి మాత్రం విపక్షాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో అక్కడ పోరు జరిగింది. అయితే 2014లో 76.13శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ సరిగ్గా ఐదేళ్ల తర్వాత పిక్చర్ మారిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. అందుకే హర్యానాలో బీజేపీ గట్టెక్కేందుకు చెమటలు కక్కుతోంది.
తగ్గిన పోలింగ్ శాతం..బీజేపీకి తలనొప్పి
2019 హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పడిపోయి 68.47శాతమే జరిగింది. ఇప్పుడు ఇదే బీజేపీ కొంప ముంచింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీ కాంగ్రెస్ల మధ్య చాలా దగ్గరగా పోటీ నెలకొంది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే పోలింగ్ శాతం భారీగా ఉన్నింది. దీంతో ఫలితాలు కూడా ముందుగా ఊహించినట్లుగానే వచ్చాయి. స్పష్టమైన మెజార్టీతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి.
ఓటు వేసేందుకు రాని ఓటర్లు
ఇక ఈసారి హర్యానాకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సెలవులు ఉండటంతో చాలా మంది ఓటింగ్కు అందుబాటులో లేరు. అయితే ఇది బీజేపీని దెబ్బతీస్తుందని ఆ పార్టీ ముందుగానే పసిగట్టింది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓటు వేయడం మరువద్దు అంటూ పదేపదే పిలుపునిచ్చారు. ఓటింగ్ ఒక విధిగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
పుంజుకున్న కాంగ్రెస్, జేజేపీ
ఎర్లీ ట్రెండ్స్ చూస్తే హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడం కష్టమే అని తెలుస్తోంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. కానీ ఆ సంఖ్య వచ్చేలా కనిపించడం లేదు.2014తో పోలిస్తే కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగేలా కనిపిస్తున్నాయి.అదే సమయంలో జన్నాయక్ జనతా పార్టీ కూడా తన స్థానాలను పెంచుకునేలా కనిపిస్తోంది. 2014లో కాంగ్రెస్ 15 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వగా బీజేపీ 47 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మొత్తానికి తక్కువ శాతం పోలింగ్ జరగడంతో బీజేపీకి ప్రాణసంకటంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సారి కింగ్మేకర్గా అవతరించిన జన్నాయక్ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.