నాలుగే నాలుగు రోజుల్లో మళ్లీ మోతమోగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: ఈ సారి ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వంటగ్యాస్ రేటును పెంచేశాయి చమురు సంస్థలు. ఒక్కో సిలిండర్ మీద కొత్తగా 25 రూపాయలను పెంచాయి. పెంచిన ధర అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
వంటగ్యాస్ సిలిండర్ ధరను చమురుసంస్థలు పెంచడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కిందటి నెల 25వ తేదీన 25 రూపాయల మేర సిలిండర్ రేటును చమురు సంస్థలు పెంచిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు తిరిగేసరికి మరోసారి రేటును పెంచారు. ఈ సారి కూడా 25 రూపాయల మేర సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో సిలిండర్ ధర 819 రూపాయలకు చేరింది. రాష్ట్రాల్లో దాని రేటు మరింత పెరుగుతుంది.
కిందటి నెలలోనే వంటగ్యాస్ సిలిండర్ రేటు.. దశలవారీగా 100 రూపాయల వరకు పెరిగింది. కిందటి నెల 4వ తేదీన 25 రూపాయలను పెంచారు. 15వ తేదీన 50 రూపాయల చొప్పున వడ్డించారు. అదే నెల 25వ తేదీన మరో 25 రూపాయలను పెంచాయి చమురు సంస్థలు. సరిగ్గా నాలుగో రోజు మళ్లీ 25 రూపాయల మేర వడ్డింపు విధించారు. ఈ పెంపుదల పట్ల నెటిజన్లు భగ్గు మంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలను సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేస్తోన్నారు.
డిసెంబర్ నుంచి పోల్చితే వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయల వరకు పెరిగింది. డిసెంబర్ 1వ తేదీ నాటికి 594 రూపాయలు ఉన్న ధర.. జనవరి 1 నాటికి 644 రూపాయలకు చేరింది. ఈ నెల 4వ తేదీ నాటికి 644 నుంచి 694 రూపాయలు, 4వ తేదీ నుంచి 15వ తేదీ నాటికి 719 నుంచి 769 రూపాయలకు పెరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 25 నాటికి 769 నుంచి 794 రూపాయలకు చేరింది. కిందటి నెల 25వ తేదీ నుంచి సోమవారం నాటికి అదనంగా మరో 25 రూపాయల భారాన్ని మోపారు. తాజా పెంపుతో ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర ధర 794 రూపాయల నుంచి 819 రూపాయలకు చేరింది.