సామాన్యుడికి షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. 15రోజుల వ్యవధిలో రెండోసారి...
సామాన్యులకు నాన్ సబ్సిడీ ఎల్పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర మరింత భారం కానుంది. 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి రూ.50 పెరిగింది. ఈ నెల 2వ తేదీన ఎల్పీజీ సిలిండర్పై రూ.50 పెంచిన చమురు సంస్థలు... మంగళవారం(డిసెంబర్ 15) మరోసారి ధరలు పెంచడం గమనార్హం. దీంతో 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ ధర రూ.100 పెరిగింది. పెరిగిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రూ.644కి అందుబాటులో ఉన్న సిలిండర్ ధర రూ.694కి చేరింది. 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు మరో రూ.18కి పెంచాయి. 19కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై మరో రూ.36.50 భారాన్ని మోపాయి.
Recommended Video
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.644కి,కోల్కతాలో రూ.670.50కి,చెన్నైలో రూ.620.50కి చేరింది. ప్రతీ నెలా గ్యాస్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సమీక్షించి సవరణలు చేస్తుంటాయి. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1296కి చేరింది.
కాగా,గృహ వినియోగదారులకు ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద సప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడీ డబ్బులను కస్టమర్ల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. సిలిండర్ ధరలు ప్రతీ నెలా మారుతుండటంతో సబ్సిడీ కూడా మారుతూ వస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు,డాలర్తో రూపాయి మారకం విలువ ఆధారంగా చమురు సంస్థలు దేశంలో ఎల్పీజీ ధరలను నిర్ణయిస్తాయి.