మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: లాక్డౌన్ ప్యాకేజీని ఇలా పిండుతున్నారా? నెటిజన్లు ఫైర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వంటగ్యాస్ రేటును పెంచేశాయి చమురు సంస్థలు. ఒక్కో సిలిండర్ మీద కొత్తగా 25 రూపాయలను పెంచాయి. పెంచిన ధర అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
తాజా పెంపుతో సిలిండర్ ధర 794.50 రూపాయలకు చేరింది. ఈ ఒక్క నెలలోనే వంటగ్యాస్ సిలిండర్ రేటు.. దశలవారీగా 100 రూపాయల వరకు పెరిగింది. ఈ నెల 4వ తేదీన 25 రూపాయలు పెరిగింది. 15వ తేదీన 50 రూపాయల చొప్పున పెంచాయి. మళ్లీ ఇప్పుడు 25 రూపాయలను పెంచాయి చమురు సంస్థలు. ఈ పెంపుదల పట్ల నెటిజన్లు భగ్గు మంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలను సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేస్తోన్నారు.
డిసెంబర్ నుంచి పోల్చితే వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయల వరకు పెరిగింది. డిసెంబర్ 1వ తేదీ నాటికి 594 రూపాయలు ఉన్న ధర.. జనవరి 1 నాటికి 644 రూపాయలకు చేరింది. ఈ నెల 4వ తేదీ నాటికి 644 నుంచి 694 రూపాయలు, 4వ తేదీ నుంచి 15వ తేదీ నాటికి 719 నుంచి 769 రూపాయలకు పెరిగింది. తాజాగా- ఈ నెల 15వ తేదీ నుంచి 25 నాటికి 769 నుంచి 794 రూపాయలకు చేరింది. ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర ధర 794 రూపాయలు పలుకుతోండగా.. రాష్ట్రాల్లో దాని రేటు మరింత పెరుగుతుంది.
వంటగ్యాస్ సిలిండర్ రేటును యథేచ్ఛగా పెంచుకుంటూ పోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ ప్యాకేజీని ఈ రకంగా పిండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయడమే కాకుండా.. రోజురోజుకూ పెరుగుతోన్న ధరలను నియంత్రించలేకపోవడం మోడీ సర్కార్ వైఫల్యానికి అద్దం పడుతోందని చురకలు అంటిస్తున్నారు.