మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు: ఎంతంటే?
న్యూఢిల్లీ: మరోసారి సబ్సిడీ వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా సబ్సిడీ సిలిండర్పై రూ.2.94లు మేర పెరిగింది. అలాగే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగింది.
ఈ ఏడాది జూన్ నుంచి గ్యాస్ సిలిండర్ రేట్లు వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పెంపుతో సబ్సిడీ సిలిండర్ మొత్తం ఆరు నెలలో రూ.14.13 పెరిగింది. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 505.34కి చేరగా, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 880గా ఉంటుంది.
అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతోపాటు విదేశీమారకం రేటులో ఒడిదుడుకుల వల్ల ధరలు పెరుగుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అధికారులు వెల్లడించారు.
పెరిగిన ఇంధన ధరల ప్రకారం వినియోగదారులపై భారం పడకుండా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్నదని, అయితే జీఎస్టీ భారం మాత్రమే వినియోగదారులపై పడుతుందని తెలిపారు. అయితే అక్టోబర్లో రాయితీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాలో రూ.376.60 జమకాగా, నవంబర్లో రాయితీ రూ.433.66కు పెరగనున్నదని అధికారులు వెల్లడించారు.